హైఅలర్ట్: బలపడుతున్న వాయు తుఫాను..గుజరాత్ వైపు ప్రయాణం
తుఫాను "వాయు" ఉత్తరభారతం వైపు చురుకుగా కదులుతోంది. జూన్ 13 నాటికి గుజరాత్లోని పోరబందర్ ముహువాల మధ్య తీరం తాకనుంది. ఆ సమయంలో గాలులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఇక తీరాన్ని తాకిన రెండ్రోజుల తర్వాత గుజరాత్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంటే గురువారం నాటికి తీవ్రరూపం దాలుస్తుందని చెప్పారు.
లక్ష్వద్వీప్లోని అమినిదీవిలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న 24 గంటల్లో ఇది బలపడుతుందని చెప్పారు.గుజరాత్లో భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీర ప్రాంతంలో మోహరించాయి. సౌరాష్ట్ర కచ్ తీరంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయి. ఇక తీరప్రాంతం వెంబడి ఆర్మీ, నేవీ బలగాలతో పాటు కోస్ట్ గార్డ్ కూడా అలర్ట్గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
ఇక "వాయు" తుఫాను తూర్పు మధ్య భారతం వరకు పాకుతుందని చెప్పిన అధికారులు అరేబియన్ సముద్రం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలపై కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. ఇక తుఫాను "వాయు" ప్రభావం లక్షద్వీప్, కేరళ, కర్నాటక, దక్షిణ మహారాష్ట్ర పై కూడా స్వల్పంగా ఉంటుందని వెల్లడించారు.
బుధవారం ఉదయం గుజరాత్ తీరంను తాకి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని వెదర్ డిపార్ట్మెంట్ వివరించింది. ఆ తర్వాత బుధవారం రాత్రికి బలమైన గాలులు గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.ఇక మహారాష్ట్ర తీరంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అదే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణశాఖ.
ఇక అరేబియన్ సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని లక్షద్వీప్, కేరళ, కర్నాటక , మహారాష్ట్రాల తీరాల్లో ఉండే మత్స్యకారులు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. ఇక జూన్ 12 మరియు 13వ తేదీల్లో గుజరాత్ తీరంలో ఉండే మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని వాతావరణశాఖ హెచ్చరించింది.