కంప్యూటర్ ఆన్ చేయగానే భారీ పేలుడు: ఉలిక్కి పడ్డ బెజవాడ జనం
కృష్ణా: విజయవాడ సుందరయ్యనగర్లోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న బారీ పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు. అయితే, పేలింది సిలిండర్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పద్మారావు తన ఇంట్లో కంప్యూటర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సిలిండర్ నుంచి వంటగ్యాస్ లీకైందని.. గమనించకుండా కంప్యూటర్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులతో పాటు పార్కింగ్లోని ఓ కారు, పక్కనున్న నాలుగు ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కాగా, రాత్రంతా గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన పద్మారావు, పనిమనిషి జ్యోష్నను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.