ఏపీలో పెట్టుబడులకు సైరస్ ఆసక్తి, రాజధానికి భూములివ్వం.. రైతుల ఝలక్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ చైర్మన్ ఆసక్తి కనబరుస్తోంది. టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్తరీ బుధవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడుల గురించి చర్చించారు.
సిఆర్డీఏ అధికారులను నిలదీసిన పెనుమాక రైతులు
గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన సీఆర్డీఏ అవగాహన సదస్సు బుధవారం నాడు రసాభాసగా మారింది. ప్రణాళికలో ఇచ్చిన భూముల సర్వే నంబర్లు తొలగించాలని రైతులు ఆందోళన చేపట్టారు.
తాము భూములు ఇవ్వకుండానే ప్రణాళికలో ఎలా చూపిస్తారని అధికారులను రైతులు నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమని రైతులంతా తీర్మానం చేసి ప్రభుత్వానికి షాకిచ్చారు.
ఫిబ్రవరిలో పోలవరం పనులు ప్రారంభం: దేవినేని
ఫిబ్రవరి నెలలో పోలవరం పనులు ప్రారంభిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా గొర్రిఖండి కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రూ.20 కోట్లతో ఏలేరు ప్రాజెక్టును ఆధునికీకరిస్తామన్నారు. 2018 నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తవుతాయన్నారు.