డీఎస్, హరీష్ల వాగ్వాదం: పోటీ నుండి కాంగ్రెస్ ఔట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ ఎన్నిక అంశంపై కాంగ్రెసు పార్టీ మండలి పక్ష నేత డి శ్రీనివాస్ బుధవారం మండిపడ్డారు. మండలిలో డిఎస్ మాట్లాడుతూ... అధికార పక్షం పైన నిప్పులు చెరిగారు. చైర్మన్ ఎన్నిక కోసం హడావుడిగా ఎందుకు సమావేశమెందుకని ప్రశ్నించారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలన్నారు.
దానికి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ జరుగుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున నామినేషన్ వేసి ఇప్పుడు వాయిదా వేయాలడం సరికాదన్నారు. నామినేషన్ వేశారంటే ఎన్నికను అంగీకరించినట్లేనని చెప్పారు. తెరాసలో చేరిన వారిని కాపాడేందుకు బ్యాలెట్ పద్దతిని ప్రవేశ పెట్టారని విమర్శించారు. చైర్మన్ ఎన్నిక విషయంలో సంప్రదాయం పాటించడం లేదన్నారు.
టీడీపీ వాకౌట్
శాసన మండలి చైర్మన్ పదవికి పోటీ పెట్టి అధికార, ప్రతిపక్షాలు తప్పులు చేశాయని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి అన్నారు. ఇరు పక్షాలు తప్పు చేసినందువల్ల తాము ఓటింగులో పాల్గొనటం లేదని, వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. చైర్మన్ ఎన్నిక విషయంలో అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. రహస్య బ్యాలెట్ పద్ధతి సరికాదన్నారు.
నామినేషన్ వేశారంటే ఎన్నికను అంగీకరించినట్లేనని చెప్పిన హరీష్ రావు వ్యాఖ్యలకు పొంగులేటి సుధాకర్ రెడ్డి సమాధానమిచ్చారు. తమ వాయిస్ వినిపించేందుకే తాము నామినేషన్ దాఖలు చేశామని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరించవద్దన్నారు. మండలికి పలువురు మంత్రులు హాజరయ్యారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అధికార పక్షం తమను హైజాక్ చేస్తోందని విమర్శించారు. శాసన సభా వ్యవహారాల మంత్రి మాట్లాడితే సరి, ఇతర మంత్రులు మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రావడంలో తమ కృషి ఉందని, దానిని తక్కువ చేయడం సరికాదన్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని అన్నారు. మండలిలో ఈటెల రాజేందర్ మాట్లాడారు. దీనిపై షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడాలంటే తాము చాలా విషయాలు మాట్లాడుతామని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
[డీఎస్, హరీష్ వాగ్వాదం
రహస్య బ్యాలెట్ పైన తమకు విశ్వాసం లేదని డీ శ్రీనివాస్ అన్నారు. అధికార పక్షం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఎన్నికల తీరుకు నిరసనంగానే ఓటింగును బహిష్కరిస్తున్నామన్నారు. దీనిపై హరీష్ రావు, నాయిని నర్సింహారెడ్డిలు ధీటుగా స్పందించారు. ఓడిపోతామని తెలిసి కాంగ్రెసు పార్టీ భయపడుతోందన్నారు. పెద్దల సభలో డీఎస్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మండలిలో కాంగ్రెస్ పార్టీ తీరు బాగా లేదన్నారు. డీఎస్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు.
పోటీ నుండి తప్పుకున్న కాంగ్రెస్
మండలి చైర్మన్ పోటీ నుండి కాంగ్రెసు పార్టీ అనూహ్యంగా తప్పుకుంది. మండలి నుండి వాకౌట్ చేసింది. దీంతో హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎందరు ఓటు వేస్తారో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ పోటీ నుండి తప్పుకుందన్నారు. పోటీలో ఉండి ఉంటే హుందాగా ఉండేదన్నారు.