అధిష్టానంపై డిఎస్ అసహనం: 7న నెల్లూరు బంద్
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతోందనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ శాసన మండలి సభ్యులు, పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ గురువారం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన కొత్తదేమీ కాదన్నారు. అయితే దీని ద్వారా అధిష్టానం కొత్త సమస్యలను తీసుకు రావొద్దన్నారు.
రాయల తెలంగాణ వృథా ప్రయాసే అన్నారు. దానిని ఎవరూ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, రాయలసీమ విభజనను సీమ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ న్యాయం చేస్తారనే విశ్వాసం తమకు ఉందన్నారు. పది జిల్లాల తెలంగాణనే ఏర్పడుతుందని ఆకాంక్షించారు.
సీమను విభజిస్తే నష్టం: సోమిరెడ్డి
రాయలసీమ ను విభజిస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మరణ శాసనమని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో అన్నారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ఈ నెల 7న జిల్లా బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. రాయల తెలంగాణ ఏర్పాటు అయితే నాలుగు జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి భీడుగా మారుతుందన్నారు.
మా భవిష్యత్తుపై ఆందోళన లేదు: గాదె
తమ భవిష్యత్తు పైన తమకు ఎలాంటి ఆందోళన లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం అందరికంటే ఎక్కువగా పోరాడింది సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలే అన్నారు. అసెంబ్లీలోను తాము గట్టిగా సమైక్యవాదం వినిపిస్తామన్నారు. అలాంటప్పుడు తమ భవిష్యత్తు పైన తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. విభజనకు తాము వ్యతిరేకమన్నారు.