దాచేపల్లి రేప్ ఇష్యూ: 'రాజకీయంగా వాడుకోవాలని జగన్, కానీ వైసీపీ వాళ్లేనని తేలింది'
గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారని హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం ఆరోపించారు. నిందితుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని తేలిందని, ఇప్పుడు వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
పదిమందికి మంచి చెప్పే నేను, చేయకూడని పని చేశా: ఆత్మహత్యకు ముందు దాచేపల్లి నిందితుడు
Recommended Video
ఆయన యరపతినేని శ్రీనివాస రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి వారు రూపాయం సహాయం చేయలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. అసత్య ప్రచారానికి దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా, నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సుబ్బయ్య తాత అని పిలిచిన పాపానికి
నా కూతురు బాధ చూడలేకపోతున్నానని అత్యాచార బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతురుకు జరిగిన అన్యాయం మరే బిడ్డకూ జరగకూడదన్నారు. సుబ్బయ్య తాత అని రోజూ పిలిచిన పాపానికి అతను ఇంత దారుణానికి ఒడిగట్టాడన్నారు. అతని మనసులో ఇంత దురాలోచన ఉందని తొమ్మిదేళ్ల పసిబిడ్డ గుర్తించలేకపోయిందని ఆ తల్లి అన్నారు.
రాజకీయం చేస్తున్నారు
దాచేపల్లిలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.5 లక్షలు ప్రకటించినట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే యరపతినేని రూ.2 లక్షలు ప్రకటించారు. దాచేపల్లి ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది పోయి కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. కాగా నిందితుడు సుబ్బయ్య సోదరుడి కొడుకు చిట్టినాయుడు గురజాల వైసీపీ నాయకుడు అని, వైసీపీ ఫ్లెక్సీలో సుబ్బయ్య కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయని అంతకుముందు యరపతినేని అన్నారు.
ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు
దాచేపల్లి ఘటనపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అన్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
మృతిపై అనుమానాలు
మరోవైపు, దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా ప్రచారం సాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో ఉందనిఅంటున్నారు. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అత్యాచారం కలకలం రేపిన విషయం తెలిసిందే.