దాదాగిరి: కేసీఆర్ వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్, సముద్రంపాల్చేశారంటూ మండిపాటు
అమరావతి/నెల్లూరు: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతూనే ఉంది. తెలంగాణ జల దోపిడీకి పాల్పడుతుందంటూ ఏపీ మంత్రులు.. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో నీటిని మళ్లిస్తుందంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దాదాగిరి ఎవరు చేశారో తెలుసు: సజ్జల
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు దాదాగిరి చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా, ఆయన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ దాదాగిరి చేయడం లేదని అన్నారు. ఎవరు దాదాగిరి చేశారో అందరీకి తెలుసని అన్నారు. దాదాగిరి అంటే విద్యుత్పత్తి పేరుతో నీటిని సముద్రానికి వదలడమే కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ సర్కారు నియమాలను తుంగలో తొక్కింది..
అంతేగాక, జల విద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రంపాలు చేశారని సజ్జల విమర్శించారు. కేంద్ర జలశక్తి ఆదేశాలను కూడా పొరుగురాష్ట్రం(తెలంగాణ) పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామనే భావనతో జలవివాదం తెచ్చారని అన్నారు. సాగు అవసరాలను కాదని, విద్యుత్పత్తి కోసం నీటిని వినియోగించరాదన్న నియమాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఏపీ నీటి వాటా కాపాడుకునేందుకే సీఎం జగన్ ప్రయత్నించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఏపీ దాదాగిరి చేస్తోందంటూ కేసీఆర్..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన కేసీఆర్.. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని అన్నారు. కేంద్రం కూడా తెలంగాణకు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. కాగా, నెల్లూరు జిల్లా అభివృద్ధి సంక్షేమంపై జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సోమవారం సజ్జల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్ల పథకంపై చర్చించినట్లు తెలిపారు. ఉపఎన్నికల ఫలితాలపై బేరీజు వేసుకున్నామన్నారు.
Recommended Video
లోకసభకు జలవివాదం..
ఇది ఇలావుండగా, 299 టీఎంసీల కోటా నుంచి తెలంగాణ అదనంగా నీరు వాడుకుందని, కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం లోక్సభలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వరదజలాల వినియోగంపై కేంద్రం వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు.