దాడి తీవ్ర వ్యాఖ్య: తోడుగా.. విజయమ్మపై జగన్ వివరణ
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లిని విశాఖలో గెలిపించేందుకు కృషి చేయలేదన్న దాడి వీరభద్ర రావు వ్యాఖ్యల పైన వైయస్ జగన్ గురువారం స్పందించారు. తల్లిని, చెల్లిని కూడా నమ్మలేనివాడు.. ఇక ప్రజలను ఏం నమ్ముతాడని, ఎలా పాలిస్తాడని దాడి ఘాటైన విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో జగన్ ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. తన తండ్రి మరణానంతరం తనకు తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని జగన్ చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటుందన్న ఆలోచనతోనే అమ్మను విశాఖ స్థానం నుంచి నిలబెట్టినట్లు చెప్పారు.
తన అమ్మ విశాఖ నుండి పోటీ చేస్తే ఉత్తరాంధ్రకు భరోసా ఉంటుందని తాను భావించానని చెప్పారు. స్థానిక కార్యకర్తలు, నేతలపై నమ్మకంతోనే ఈ పని చేశానని చెప్పారు. విశాఖ లోకసభ ఎన్నికల సమయంలో కడప నుండి ఒక్క సామాన్య కార్యకర్త కూడా విశాఖకు రాలేదని చెప్పారు.
ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశంలో భాగంగా జగన్ గురువారం విశాఖలో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల పైన విజయవాడలో సమీక్ష నిర్వహించనున్నారు. కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాలులో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తారు.