జగన్ను ఏకేసిన దాడి టిడిపిలోకి? బిజెపిలోకి కాటసాని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్ర రావు మళ్లీ సొంత గూటికి చేరుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయన టిడిపిలో చేరుతారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దాడి కొద్ది నెలల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక బుధవారం రాజీనామా చేశారు. జగన్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
ఏ పార్టీలో చేరుతారని ప్రశ్నిస్తే... వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి తాను తప్పు చేశానని, ఇప్పుడు రాజీనామా చేసి దానిని సరిదిద్దికుంటున్నానని చెప్పారు. ప్రస్తుతానికి కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటానని, ఆ తర్వాత కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే దాడి టిడిపిలో చేరవచ్చునని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. అంతేకాకుండా.. కాంగ్రెసు వ్యతిరేకి అయిన ఆయన, కాంగ్రెసు పార్టీని నిలదీస్తానంటేనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినట్లు చెప్పారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాల్లేవు. దీంతో మిగిలింది టిడిపియే అంటున్నారు.
కమలం చెంతకు కాటసాని
మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో కాటసాని సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో ఆయన పాణ్యం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓటమి చెందారు. నరేంద్ర మోడీ విధివిధానాలు నచ్చడం వల్లే బిజెపిలో చేరినట్టు చెప్పారు.