ఏపీకి అన్యాయం రహస్య ఏజెండాలతోనే: టిడిపి, బిజెపిపై దాడి విమర్శలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీకి హోదా లేదని చెబుతూ వచ్చిందని అన్నారు.
రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రతి పార్టీకి రహస్య ఎజెండాలు ఉన్నాయని, వాటిని అమలు చేసుకునేందుకు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ఎపీకి అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు.
హోదా ఇవ్వం, ప్యాకేజీ ఇస్తామని బీజేపీ ఆది నుంచి చెబుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ, టీడీపీ ఈ విషయంలో ప్రజలను మభ్యపెడుతూ వచ్చాయని వీరభద్రరావు ఆరోపించారు.
నిజంగా ఏపీకి హోదా ఇవ్వాలని వుంటే బీజేపీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. బీజేపీకి హోదా ఇవ్వాలనే ఆలోచన లేనప్పుడు 'నీతిఆయోగ్' అంటూ సాకులు చెబుతోందని ఆయన అన్నారు.
బీజేపీ మీద నమ్మకం ఉంది: కంభంపాటి రామ్మోహనరావు
బీజేపీ మీద నమ్మకం ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్తో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాను మించిన ప్రయోజనాలు సమకూరుస్తుందన్నారు.
ఆర్థిక లోటును ఉన్నపళంగా తీర్చడం సాధ్యం కాదని చెప్పిన ఆయన.. సాధ్యమైనంత మేర బీజేపీ ఆ లోటును పూరిస్తుందని ఆయన అన్నారు. అయితే అన్నీ అడగ్గానే ఇచ్చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.
కేంద్రం నెమ్మదిగా అన్ని పనులను పూర్తి చేస్తుందని ఆయన చెప్పారు. అంతవరకు ఓపిక అవసరమని ఆయన చెప్పారు. సహనంగా ఉంటే అన్నీ సాధ్యమవుతాయని రామ్మోహనరావు ఆశాభావం వ్యక్తం చేశారు.