ఏర్పోర్ట్: ఎన్టీఆర్కి 'జగన్' నేత మద్దతు, ఎల్పీగా పాయం
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల నుండి కూడా డిమాండ్ వినిపించడం గమనార్హం. అయితే వారు గతంలో టిడిపిలో పని చేసిన వారు ఉన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుండి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జగన్ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు కూడా అదే చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు రగడ పైనా స్పందించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని దాడి డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ పేరుపెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. అప్పుడు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతు రావు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు.
ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఎన్టీఆర్ ఒక అధ్యాయమని, ఆయన చేసిన సేవలకు అనుగుణంగా తెలుగుజాతి గర్వపడేలా ఎన్డీఎ ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నారు.
తెలంగాణ జగన్ పార్టీ శాసన సభా పక్ష నేతగా వెంకటేశ్వర్లు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అరకు ఎంపి కొత్తపల్లి గీత, కార్యదర్శిగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోశాధికారిగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక, విప్గా ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. వీరి పేర్లను పార్టీ అధ్యక్షులు జగన్ శనివారం ప్రకటించారు. పార్టీ అధికార జాతీయ ప్రతినిధులుగా తిరుపతి ఎంపి వి వరప్రసాదరావు, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి పివి మిథున్ రెడ్డిని నియమించారు.
తెలంగాణ అసెంబ్లీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఉప నేతగా పాయం వెంకటేశ్వర్లు, విప్గా మదనలాల్ నాయక్ను నియమించారు. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడహక్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో ఎంపి శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్ర రావు, జనక్ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్, రెహ్మాన్, విజయా రెడ్డిలు ఉన్నారు.