గెలిచి ఉంటే కీలక పదవి దక్కేది..! ప్రత్యర్ధులను సైతం బాదిస్తున్న దగ్గుబాటి ఓటమి..!!
అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని ఓటములు ప్రత్యర్ధులను సైతం విచారానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన సంఘటనే ఏపిలో జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయనకు ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఓటమి అనేది తెలియదు. అయితే తొలిసారి అయన ఓటమి పాలయ్యారు. గెలిచి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో కీలక పదవి దక్కేది. అయితే ఆ అవకాశాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేజేతులా చేజార్చుకున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వాస్తవానికి రాజకీయాలంటే విముఖత పుట్టింది. గత ఎన్నికల్లోనూ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయాల్లో రాణిస్తుండటంతో ఆయన పోటీ ఆలోచన విరమించుకున్నారు. ఈసారి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాలని భావించలేదు. కుమారుడు హితేష్ చెంచురామ్ చేత రాజకీయ అరంగేట్రం చేయించాలని భావించారు.దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ముఖ్యమైన పదవిలో ఉండటం, ఆమె విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేస్తుండటంతో ఆయన తాను పోటీ చేసేందుకు తొలుత సుముఖత వ్యక్తం చేయలేదు.
ఆయన తన కుమారుడు హితేశ్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరి..హితేష్ ను పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉండటం, చివరి నిమిషం వరకూ అది రద్దు కాకపోవడంతో జగన్ సూచన మేరకు ఆయనే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. కేవలం 1503 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలిచారు.
జగన్ వేవ్ లోనూ దగ్గుబాటి గెలవకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దగ్గుబాటి సక్రమంగా ప్రచారం చేయకపోవడం, డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్లనే ఓటమిపాలయ్యారని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో దగ్గుబాటి అంత దురదృష్టవంతుడు మరెవ్వరూ లేరన్నది మాత్రం పచ్చి నిజం.