అన్ని అంశాలు ముందే చెప్పాం! అయినా నా భర్తను గెంటేస్తారా? వైసీపిపై మండిపడ్డ పురంధేశ్వరి!
అమరావతి/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులకు రాజకీయ భృతి లభించగా, మరికొంత మంది మాత్రం ఇంకా అనిశ్చితి వాతారణంలోనే ఉన్నారు. సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి ఇలాగే తయారయ్యింది. ఆయన రాజకీయ ప్రస్తానం మళ్లీ అగమ్యగోచరమయ్యింది. ఎన్నో ఆశలతో వైసీపిలో చేరిన దగ్గుబాటికి పరుచూరు నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన రాజకీయ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. తాజాగా వైసీపిలో కొనసాగుతున్న దగ్గుబాటికి ఆయన భార్యను కూడా వైసిపిలో చేర్పించాలనే ప్రతిపాదన రావడంతో అది కుదరని పని అనుకుని ఆయనే వైసీపిపిని ఒదిలేసారు. ఇదే అంశంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఘాటుగా స్పందించిన పురంధేశ్వరి!
దగ్గుబాటి దంపతులకు వైయస్సార్ సీపీ ఇచ్చిన రాజకీయ అవకాశం, తర్వాత జరిగిన తాజా పరిణామాలపై చిన్నమ్మ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజులుగా మాజీ మంత్రులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతుల గురించే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో చెరో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి దంపతులు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర సంకట స్థితిలో ఉన్నారు. బిజెపిలో కీలక నేతగా ఉన్న పురందేశ్వరి తన భర్త కొనసాగుతున్న వైసీపీతో పాటు, ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
భార్య పురంధేశ్వరి బీజేపిని వీడే ప్రసక్తే లేదు..!
ఇది సహజంగా వైసిపి వాళ్ళకే కాకుండా, సగటు రాజకీయ నాయకులకు సైతం రుచించడం లేదు. దీంతో దగ్గుబాటి దంపతులు వేర్వేరు పార్టీల్లో ఉంటూ చేస్తున్న రాజకీయం నచ్చని జగన్ ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పురందేశ్వరి బిజెపి నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించకపోవడంతో దగ్గుబాటితోపాటు ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ వైసీపీని వీడేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారని, వారు ఇదే విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.
ముందు అన్ని విశయాలు చెప్పినా గెంటేస్తారా..?
ఇక ఇదే అంశంపై పురంధేశ్వరి సైతం స్పందించారు. పురందేశ్వరిని తమ పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో స్పష్టత నిచ్చారు. గత ఎన్నికలకు ముందే తనకు వైసీపీ నుంచి ఆహ్వానం అందిందని, ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సంప్రదింపులు జరగట్లేదని చెప్పారు. ఇక తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరే క్రమంలో తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా వైసీపీ ముఖ్య నేతలకు చెప్పారని ఆమె తెలిపారు. అందుకు అంగీకరించాకే తన భర్త, కుమారుడు ఆ పార్టీలో చేరినట్టు ఆమె స్పష్టం చేశారు.
జగన్ కు హితవు పలికిన చిన్నమ్మ..!!
ఇప్పుడు మళ్లీ తనను వైయస్సార్ సీపిలో చేర్పించాలని తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై ఒత్తిడి తేవడం సమంజసం కాదని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో చేరేంముందు ఒక మాట, చేరిన తర్వాత మరోమాట మాట్లడటం మంచిది కాదని వైసీపి నేతలకు హితవు పలికారు పురంధేశ్వరి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నయని, ప్రధానంగా ఇసుక సమస్య జగన్ ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఏదేమైనా దగ్గుబాటి వెంకటేశ్వర రావు అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనపై ఈయనే స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.