'ఎన్టీఆర్' జీవితంలో అది నిజం.. 'విలన్' ఎవరో జనం డిసైడ్ చేస్తారు: పురంధేశ్వరి
తప్పయినా.. ఒప్పయినా.. లక్ష్మీపార్వతితో వివాహం, ఆపై వైస్రాయ్ హోటల్ వేదికగా సాగిన ఘటనలు కూడా ఎన్టీఆర్ జీవితంలో భాగమేనని, కాబట్టి వాటిని కూడా సినిమాలో చూపించాల్సి ఉంటుందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: సినిమాల్లోను.. రాజకీయాల్లోను.. తెలుగునాట తనదైన ముద్రవేసిన దివంగత ఎన్టీఆర్ జీవితచరిత్ర సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్వయంగా ఇందుకు పూనుకోవడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది.
అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్రను చూపించే క్రమంలో వాస్తవాలను ఎంతవరకు స్క్రీన్ పై చూపిస్తారన్నది ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలోను మెదులుతోన్న ప్రశ్న. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఉదంతం, లక్ష్మీ పార్వతితో వివాహం వంటి అంశాలకు సినిమాలో చోటు ఉంటుందా లేదా అన్న దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, బాలకృష్ణ అక్క పురంధేశ్వరి తాజాగా దీనిపై స్పందించారు. బాలకృష్ణ తీయబోయే 'ఎన్టీఆర్' సినిమాపై, ప్రస్తుత రాజకీయాలపై ఆమె ఏం స్పందించారో ఆమె మాటల్లోనే..
'ఎన్టీఆర్' జీవితంలో అది నిజం..
తప్పయినా.. ఒప్పయినా.. లక్ష్మీపార్వతితో వివాహం, ఆపై వైస్రాయ్ హోటల్ వేదికగా సాగిన ఘటనలు కూడా ఎన్టీఆర్ జీవితంలో భాగమేనని, కాబట్టి వాటిని కూడా సినిమాలో చూపించాల్సి ఉంటుందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.
అప్పట్లో.. భర్తను వారించినా వినలేదు..:
అప్పటి వైస్రాయ్ హోటల్ ఘటన నేపథ్యంలో.. తన తండ్రికి అన్యాయం చేయవద్దని ఆనాడు తన భర్త వెంకటేశ్వరరావును వారించానని, కానీ ఆయన తన మాటను వినిపించుకోలేదని పురంధేశ్వరి అన్నారు. ఇదే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని గుర్తుచేశారు.
లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం తప్పనుకోలేదు:
ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం తప్పని తాను భావించలేదని పురంధేశ్వరి అన్నారు. ఆ విషయంలో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని తెలిపారు. తనవరకైతే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకోలేకపోయానని, అయితే ఆయన పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు.
విలన్ ఎవరో ప్రజలు డిసైడ్ చేస్తారు?:
ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో విలన్ ఉండరని, వాస్తవాలు చూపిస్తే.. విలన్ ఎవరో ప్రజలే నిర్ణయించుకుంటారని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. నాటి వైస్రాయ్ ఘటనలో చంద్రబాబు, బాలయ్య, తన భర్త వెంకటేశ్వరరావు అందరూ ఇంట్లోనే మాట్లాడుకున్నారని, ఆపై తన భర్తను చంద్రబాబు వైస్రాయ్ హోటల్ కు తీసుకెళ్లారని చెప్పారు. వీరందరికి అప్పటి ఘటనలో బాధ్యాతయుతమైన పాత్ర ఉందని గుర్తుచేశారు.
ఇంతవరకు బాలయ్య అడగలేదు:
ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి తన తమ్ముడు బాలయ్య ఇంతవరకు తనను సలహాలేమి అడగలేదని పురంధేశ్వరి అన్నారు. సలహాల కోసం సంప్రదిస్తే సూచనలు ఇచ్చేందుక సిద్దమని తెలిపారు.
ప్రతీది ప్రజలకు తెలుసు.. వక్రీకరించడం కుదరదు:
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, ఆయన జీవితంలో జరిగిన ప్రతీ సంఘటనా ప్రజలకు తెలుసని, దాన్ని వక్రీకరించడమో లేక మరో రకంగా చూపించడమో కుదరదని పురంధేశ్వరి తెలిపారు. సినిమాకు సబంధించి వాస్తవాలను చూపించాల్సిన బాధ్యత కచ్చితంగా బాలయ్య మీద ఉందన్నారు.
భవిష్యత్ లో ఎలా ఉంటుందో?:
ఇప్పటికైతే టీడీపీతో బీజేపీ మిత్రబంధం కొనసాగుతుందని, ఆ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం మిత్రధర్మాన్ని పాటిస్తుందని పురంధేశ్వరి అన్నారు. ఇప్పటికైతే మిత్రబంధం ఉందని, భవిష్యత్తు పరిణామాలను ఊహించలేమని అన్నారు.
పార్టీ మారే ప్రసక్తే లేదు:
ఇటీవల తాను వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై పురంధేశ్వరి స్పందించారు. వైసీపీలో చేరికను కొట్టివేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలిపారు.
టీడీపీతో మిత్రబంధం కొనసాగుతుందా? లేదా అన్నది తమ పార్టీ సీనియర్లే నిర్ణయిస్తారని, పరిస్థితులను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇక వైసీపీతో బీజేపీ చెలిమి పట్ల నిర్ణయాధికారం తీసుకునేంత స్థాయి తనకు లేదని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా పురంధేశ్వరి ఈ వివరాలు వెల్లడించారు.
బాలయ్య అలా చేస్తే.. నవ్వుకుంటా:
2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పురంధేశ్వరి ఇంటి ఎదుట బాలయ్య తొడ కొట్టిన సంగతి తెలిసిందే. దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని పురంధేశ్వరి నవ్వుతూ చెప్పారు. చిన్నపిల్లాడి మనస్తత్వంతోనే బాలయ్య అలా చేసి ఉంటాడని అన్నారు.
పక్కనున్నవాళ్లు ఎవరో చెబితే బాలయ్య అలా చేసి ఉంటాడని అన్నారు. దాన్ని తాను ఎప్పుడూ తప్పుగా భావించలేదని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నవ్వి ఊరుకుంటానని అన్నారు. రాజకీయాలు, కుటుంబం బంధాలు వేరువేరని, తమ్ముడితో తనకెన్నడూ విభేదాలు లేవని తెలిపారు.