పురంధేశ్వరికి బీజేపీ పెద్దలు చెప్పారు: వైసీపీలోకి దగ్గుబాటి-కొడుకు హితేష్, జగన్ హామీలు
హైదరాబాద్/అమరావతి: రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలని తాము నిర్ణయించుకున్నామని దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆదివారం చెప్పారు. తన తనయుడు హితేష్ చెంచురాంతో కలిసి ఆయన జగన్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తాము వైసీపీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమ నిర్ణయాన్ని వైయస్ జగన్ స్వాగతించారని చెప్పారు. జగన్తో కలిసి పని చేసేందుకు తన కొడుకు సిద్ధమని చెప్పారు. జగన్ గత ఎనిమిదేళ్లుగా ఎంతో శ్రమించి పార్టీని నడుపుతున్నారని కితాబిచ్చారు.
రాజకీయాలకు పురంధేశ్వరి గుడ్బై, జగన్ పార్టీలోకి కొడుకు?: ఏపీ బీజేపీ అంటేనే..
పురంధేశ్వరి పార్టీ మారరు, అవసరమైతే
మీతో పాటు పురంధేశ్వరి బీజేపీకి దూరమై వైసీపీలో చేరుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్పందిస్తూ... తన సతీమణి పార్టీ మారరని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. పురంధేశ్వరిని పార్టీలోనే (బీజేపీ) కొనసాగాలని వారి పార్టీ పెద్దలు చెప్పారన్నారు. ఆమె చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారే అవకాశాలు లేవని, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటారని అర్థమవుతోంది.
చంద్రబాబుపై విమర్శలు
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిప్పులు చెరిగారు. నవ్యాంధ్రలో ప్రభుత్వం పని తీరు గాడి తప్పిందని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని విమర్శించారు. ప్రభుత్వం డబ్బులతో చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు డబ్బులు లేవంటూనే మరోవైపు దీక్షలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. పాలనలో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం వంటి విచిత్ర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
పర్చూరు నుంచి హితేష్ పోటీ, జగన్ పలు హామీలు
దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హితేష్లు జగన్తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దగ్గుబాటి కుటుంబానికి.. వైసీపీ అధినేత పలు హామీలు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో పర్చూరు నుంచి దగ్గుబాటి హితేష్ చెంచురాంకు పోటీ చేయించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
స్వాగతించిన వైసీపీ
దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కొడుకు హితేష్ చెంచురాం వైసీపీలోకి రావడంపై ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. దివంగత ఎన్టీఆర్ పేదవాడికి మూడు పూటలా అన్నం పెట్టే సంక్షేమ పథకాలు చేపట్టారని, వైయస్ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వారిలాగే జగన్ పని చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకే మద్దతు తెలుపుతారని అభిప్రాయపడ్డారు. పురంధేశ్వరి అంశంపై ప్రశ్నించగా... అది వారి కుటుంబ వ్యవహారమని చెప్పారు.