జగన్ను కలిసిన పురంధేశ్వరి భర్త వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్: వైసీపీలో చేరడం ఎందుకంటే?
అమరావతి: భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వెంకటేశ్వర రావు వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం వైసీపీ తరఫున పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ను వెంకటేశ్వర రావుతో పాటు హితేష్ కూడా కలిశారు.
దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తనయుడు హితేష్ వైసీపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. పురంధేశ్వరి మాత్రం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోనే ఉంటారన చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీలలో ఉన్నవారు పలువురు ఉన్నారు. తల్లి పురంధేశ్వరి బీజేపీలో ఉంటే, తండ్రి వెంకటేశ్వర రావు, కొడుకు హితేష్లు వైసీపీలో చేరనుండటం గమనార్హం.
గతంలో జగన్ పైన ప్రశంసలు
దగ్గుబాటి వెంకటేశ్వర రావు గతంలో వైసీపీ అధినేతకు కితాబిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైసీపీలో మరింత ఊపు వస్తోందని ఆరేడు నెలల క్రితం చెప్పారు. జగన్ పాదయాత్ర విజయవంతమవుతోందని అప్పుడు అన్నారు. ఆ తర్వాత గత కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అది వాస్తవం కానున్నట్లుగా ఉంది.
వైసీపీని ఎందుకు ఎంచుకుంటున్నారు?
ప్రస్తుతం ఏపీలో భారతీయ జనతా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అధికారంలోకి కాదు కదా.. కనీసం ప్రతిపక్షంలోకి లేదా మూడో స్థానంలో కూడా నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గత 2014లో గెలిచినన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుస్తారా అనే చర్చ సాగుతోంది. ఈ కారణంగానే బీజేపీకి చెందిన ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేనందునే దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తోందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేనలు మాత్రమే బలంగా ఉన్నాయని అంటున్నారు.
కొడుకు రాజకీయ ఆరంగేట్రం
భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కొడుకు హితేష్ వైసీపీలోకి వెళ్లినప్పటికీ పురంధేశ్వరి మాత్రం బీజేపీలో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీల మధ్యే పోటీ కాబట్టి తమ కొడుకు రాజకీయ ఆరంగేట్రం విజయవంతంగా ఉండేందుకు వైసీపీలో చేర్చాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో చేరే అవకాశాలు లేదు. జనసేన ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేరు. అందుకే ప్రతిపక్ష వైసీపీలో చేరుతున్నట్లుగా భావిస్తున్నారు.