రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్బై: జగన్ను సిఎం చేస్తాం.. అదే రోజు వైసీపీలోకి హితేష్
పర్చూరు: తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం చెప్పారు. ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం రాజకీయ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర రావు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
రాజకీయం గ్లామర్ ప్రపంచం కాదని, ఒక బాధ్యత అని తన కుమారుడి రాజకీయ ప్రవేశాన్ని ఉద్దేశించి చెప్పానని దగ్గుబాటి అన్నారు. ముప్పై అయిదేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం నుంచి తాను వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
త్వరలో తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం రోజున తన కొడుకు హితేశ్ వైసీపీలో చేరుతారని తెలిపారు.
దగ్గుబాటి హితేశ్ మాట్లాడుతూ.. తన రాజకీయరంగ ప్రవేశానికి తన తండ్రి స్ఫూర్తి అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు, కష్టపడేతత్వం నచ్చి ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
కాగా, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. వెంకటేశ్వర రావు, హితేష్లు వైసీపీలో చేరుతున్నారు. వెంకటేశ్వర రావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందున.. తల్లి పురంధేశ్వరి ఓ పార్టీలో, కొడుకు హితేష్ మరో పార్టీలో ఉండటం గమనార్హం.