చంద్రబాబు ఆ మాటలు నమ్మను, పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా: దగ్గుబాటి, జగన్కు ప్రశంసలు
Recommended Video
అమరావతి: బీజేపీ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు బుధవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అలాగే, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, తాను ఏ పార్టీలో లేనని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా స్వార్థం లేని వ్యక్తి అన్నారు.
విజయసాయిరెడ్డితో మొదలు!: అందివచ్చిన అవకాశం, చంద్రబాబుకు జగన్ దెబ్బకు దెబ్బ
పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా నేను ఏ పార్టీలో లేను
తాను 2014లోనే రాజకీయాల నుంచి తప్పుకున్నానని దగ్గుబాటి చెప్పారు. తన సతీమణి పురంధేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ తాను ఏ పార్టీలో లేనన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోసం చేస్తున్న ఖర్చు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఓట్లు కొనే సంస్కృతికి తాము వ్యతిరేకమని చెప్పారు.
అమరావతి ఆలోచన తప్పు కాదు, కానీ
మహా నగర నిర్మాణం ఆలోచన తప్పు కాదని అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశించి దగ్గుబాటి వ్యాఖ్యానించారు. కానీ పర్యావరణం, వికేంద్రీకరణ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు మూడు పంటలు పండే భూమిని ఎందుకు వాడుతున్నామో చూడాలన్నారు. అసలు తెలంగాణ సచివాలయం ఎన్ని ఎకరాల్లో ఉందని ప్రశ్నించారు.
జగన్పై ప్రశంసలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గుబాటి వెంకటేశ్వర రావు కితాబు ఇచ్చారు. జగన్ ప్రతిపక్ష నేతగా బాగానే పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో జగన్ పాదయాత్ర సందర్భంగా జనసమీకరణ ఉన్నప్పటికీ వైసీపీ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. పాదయాత్రతో వైసీపీ నిలదొక్కుకుందని చెప్పారు.
చంద్రబాబు మాటలు నేను నమ్మను
విభజన కష్టమైతే పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఓ వరం అని దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు. జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పట్టిసీమ వల్లే నేడు కృష్ణా డెల్టా బతికిందని చెప్పారు. ముంపు మండలాలను ఏపీలో కలపకుంటే తాను ప్రమాణం చేయనని మోడీ ప్రభుత్వంతో తాను చెప్పానని చంద్రబాబు అన్నారని, కానీ ఆ మాటలను తాను నమ్మనని తేల్చి చెప్పారు. నానాయాతనపడి గెలిచి పదవి చేపట్టకుండా ఉంటారా అని దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.