తెరపైకి కొత్త ఫోరం, ఆ బాధతో..: బాబును ఏకిపారేసిన దగ్గుబాటి, మోడీది తప్పు
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి వెంకటేశ్వర రావు నిప్పులు చెరిగారు. పరిపాలన అంటే దీక్షలు కాదని, చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఉచ్చులో చిక్కుకుపోయారని విమర్శలు గుప్పించారు.
Recommended Video
2019లో పిలిచినా కలవను: మోడీ ఆ మాటలు బాబుకు కోపం తెప్పించాయి!
ఏపీలో అధికార, విపక్ష వైసీపీలు కేవలం ఓట్ల కోసమే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. పరిపాలన అంటే దీక్షలు, శంకుస్థాపనలు, ప్రెస్ మీట్లు కాదని తెలుసుకోవాలన్నారు. కేంద్రంతో సామరస్యంగా ఉంటూ మన రాష్ట్ర హక్కులను మనం సాధించుకోవాల్సి ఉందని హితవు పలికారు.
తెరపైకి కొత్త ఫోరం
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లి ఏం చేశారని వెంకటేశ్వర రావు ప్రశ్నించారు. అక్కడ పోలవరం అంచనాల పెంపు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రంతో చర్చిస్తే ప్రయోజనం ఉండేదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై అధికారులతో చర్చించి ఢిల్లీకి వెళ్లి అడగాలన్నారు. విభజన బిల్లులో కచ్చితంగా చేయాలని ఎక్కడా లేదని, చేయవచ్చునని మాత్రమే ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫోరం ఏర్పాటుపై మాట్లాడారు. ఏపీ ప్రయోజనాల కోసం మేధావులు, రిటైర్డ్ ఉద్యోగాలు, వివిధ వర్గాల నిపుణులతో ఓ ఫోరం ప్రారంభించాలనే ఆలోచన ఉందన్నారు.
ఎన్నికల కోసమే చంద్రబాబు సహా అన్ని పార్టీలు యూటర్న్
వైయస్ జగన్ మీడియా ట్రాప్లో పడ్డారని, వైసీపీ అధినేత ట్రాప్లో చంద్రబాబు పడ్డారని వెంకటేశ్వర రావు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారని చెప్పారు. హోదా ఏమైనా సంజీవినా అని గతంలో అన్నారని, ఇప్పుడు హోదాయే కావాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని పార్టీలు కూడా ఎన్నికల కోసం యూటర్న్లు తీసుకుంటున్నాయని విమర్శించారు.
బీజేపీని విమర్శించేందుకు పోటీ
టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల పత్రికలలో హెడ్ లైన్స్ రాసుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని వెంకటేశ్వర రావు విమర్శించారు. కేవలం బీజేపీని వ్యతిరేకిస్తూ.. ఓట్ల వేటలో పడ్డారని, ఆ దిశలో ఓట్ల రాజకీయం సాగుతోందన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయని భావిస్తున్నారని, అందులో భాగంగానే కమలం పార్టీని విమర్శించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. అసలు ఏపీలో బీజేపీకి ఓట్లే లేవని చెబుతున్నారని, అలాంటప్పుడు వ్యతిరేకించి లాభం ఏమిటని ప్రశ్నించారు.
ఇంత చేసినా అలా అంటారా
ఏపీలో ఇటీవలి పరిణామాలు బాధించాయని, ఆ ఆవేదనతో తాను ప్రజలకు ఏదైనా చెప్పాలని బయటకు వచ్చానని వెంకటేశ్వర రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఏడు ముంపు మండలాలు కేంద్రం తెలంగాణ నుంచి ఏపీలో కలిపినా వివక్ష చూపిస్తోందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మనకు రావాల్సిన వాటిపై ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా నివేదికలు సమర్పించి సాధించుకోవాలన్నారు. హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఏమాత్రం సరికాదన్నారు.
ప్రధాని మాటలను తప్పుబట్టిన దగ్గుబాటి
ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, ఎస్పీవీ ఏర్పాటు చేసుకుంటే రాయితీలు, ప్రోత్సాహకాలు త్వరగా వచ్చే వీలుందన్నారు. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయులు చేసుకున్నామని చెబుతున్నారని, అలాంటప్పుడు హోదా ఎందుకన్నారు. కేంద్రం మంజూరు చేసిన జాతీయ విద్యాసంస్థలకు ఒకేసారి రూ.10వేల కోట్లు అడగడం సరికాదన్నారు. ఢిల్లీని మించిన రాజధాని అమరావతికి కడతామని ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు తిరుపతిలో చేసిన ప్రకటనను దగ్గుబాటి తప్పుపట్టారు. ఆ స్థాయిలో దేశ రాజధానిని మించి కడతామని చెప్పడం సరికాదన్నారు.