దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం: వైసీపీతోపాటు రాజకీయాలకు గుడ్బై! కారణాలివే..!
అమరావతి: సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కలుసుకోవడం, మాట్లాడటం ఇష్టం లేకనే ఆయన ఇలా చేసినట్లు తెలుస్తోంది.
జగన్ అల్టిమేటంతో...
అంతేగాక, క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురంధేశ్వరి బీజేపీలో కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ వైసీపీలో ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేయడంతో దగ్గుబాటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ రెండు కారణాలతో..
పురంధేశ్వరి వైసీపీలో చేరితో సముచిత స్థానం కల్పిస్తామని కూడా వైఎస్ జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. దగ్గుబాటిపై వైసీపీ నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. పురంధేశ్వరి వైసీపీలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీతోపాటు రాజకీయాల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన
అయితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ మేరకు అధికారక ప్రకటన మాత్రం చేయలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులు, అనుచరులతో చర్చించిన అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. రామనాథంబాబును తిరిగి వైసీపీలోకి తీసుకోవడం కూడా దగ్గుబాటి రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.