విశాఖపై పురంధేశ్వరి ఘాటు లేఖ: దగ్గుబాటి ఆగ్రహమే..
హైదరాబాద్: కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్కు ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల్లో పురంధేశ్వరి భర్త, పర్చూరు శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తిరస్కార ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ అసంతృప్తిలో భాగంగానే ఆయన తిరస్కార ఓటు హక్కును ఉపయోగించుకున్నారా అనే చర్చ సాగుతోంది.
పురంధేశ్వరికి డిగ్గీ ఫోన్ చేసి విశాఖ నుండి మారాలని కోరారట. దీనికి స్పందించిన పురంధేశ్వరి గత నెల 26వ తేదీన ఘాటైన లేఖ రాశారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజ్యసభ ఎన్నికల ద్వారా అధిష్టానానికి తన ఆగ్రహాన్ని చూపించారని అంటున్నారు. గట్టిగా సమైక్యవాదం వినిపించిన వారు కూడా తిరస్కార ఓటును వేయలేదు. దగ్గుబాటు అనూహ్యంగా దీని వైపు మొగ్గు చూపారు. అయితే, ఆయన మాత్రం ఇందులో తన భార్య పురందేశ్వరికి ఎలాంటి సమంధం లేదని చెప్పడం గమనార్హం.
కాగా, కాంగ్రెసు అధిష్టానంపై కేంద్ర మంత్రి, విశాఖపట్నం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బాంబు పేల్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. ఈ మేరకు ఆమె కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్కు ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్ర విభజన విషయంలో తమ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని, పార్టీ వైఖరితో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆమె ఆ లేఖలో అన్నారు.
సిట్టింగ్ ఎంపినైన తనను విశాఖపట్నం నుంచి మారాలని చెబుతున్నారని ఆమె అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తమతో చర్చించలేదని ఆమె అన్నారు. ఎంత అన్యాయం చేసినా తాము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. తమ గొంతులు కేసి మంటల్లో పడేశారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని అడిగితే పట్టించుకోలేదని అన్నారు.
విశాఖ రైల్వే జోన్ విషయాన్ని కూడా పట్టించుకోలేదని ఆమె అన్నారు. సిట్టింగ్ ఎంపిగా ఉన్నవారిని ఏ తప్పు చేయకున్నా నియోజకవర్గం మారాలని అడగడం ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమేనని ఆమె అన్నారు. సీమాంధ్ర ప్రజల వద్ద తమ దోషులుగా నిలబెట్టారని ఆమె అన్నారు. విభజనను ఏకపక్షంగా చేశారని ఆమె అన్నారు.
అన్నీ దిగమింగుతూ పార్టీలో ఉంటే నియోజకవర్గం మారాలని ఎలా అంటారని, ఆత్మాభిమానం లేదని అనుకుంటున్నారా అని ఆమె అడిగారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రల గొంతు కోశారని, బలిపీఠంపై బలి ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని, అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.