ఇంత ఆలస్యమా, ఆదినారాయణ క్షమాపణకు డెడ్లైన్: సూటిగా మంత్రితో చెప్పారు
దళితులపై మంత్రి, టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, దానికి ఆయన క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని దళిత సంఘాల జెఎసి హెచ్చరించింది.
విజయవాడ: దళితులపై మంత్రి, టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, దానికి ఆయన క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని దళిత సంఘాల జెఎసి హెచ్చరించింది.
చూస్తూ ఊరుకోం, జగన్కు చాలాసార్లు చెప్పా: గౌతంరెడ్డిపై వంగవీటి రాధా సంచలనం, వర్మపై..
ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
ఆదినారాయణ వ్యాఖ్యలను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. వారు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు.
ఇన్ని రోజులవుతున్నా చర్యలేవి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘటన జరిగి వారాలు గడుస్తున్నా మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఎటువంటి చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. మంత్రి తగు రీతిన స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆది క్షమాపణ చెప్పాల్సిందేనని కొల్లుకు తేల్చి చెప్పారు
మంత్రి ఆదినారాయణ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్రకు తేల్చి చెప్పారు. విషయాన్ని సదరు మంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానంటూ కొల్లు హామీ ఇచ్చారు.
ఆది క్షమాపణకు డెడ్లైన్
మంత్రి హామీ మేరకు ఈ నెల 10వ తేదీలోపు ఆదినారాయణ రెడ్డితో క్షమాపణలు చెప్పించాలని, లేదంటే ఆమరణ దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. దీక్షలో ఉన్నవారికి మంత్రి రవీంద్ర నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
ఇరవై రోజుల నుంచి దుమారం
కాగా, నంద్యాల ఉప ఎన్నికలకు ముందు మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళితులు శుభ్రంగా ఉండరని, సక్రమంగా చదువుకోరని, వారు అభివృద్ధి చెందకపోవడానికి వారే కారణమని వ్యాఖ్యానించారు. ఆయన కడప జిల్లాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరవై రోజుల క్రితం చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి.