పుట్టుకతోనే శ్రీమంతున్ని.. మనసు పెడితే తట్టుకోలేవ్: టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
తనపై వ్యక్తిగత విమర్శలకు దిగితే బాలినేని బండారం బయటపెడుతానని, తాను గనుక పూర్తిగా మనసు పెడితే తట్టుకోవడం కష్టమని' హెచ్చరించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరిని మించి మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. తనపై అవినీతి ఆరోపణలు చేశాడన్న కారణంతో.. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విరుచుకుపడ్డారు.
బాలినేని ఆరోపణలను ఖండిస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టారు. టీడీపీలో ఎవరో చెప్తే తాను అవినీతికి పాల్పడుతున్నానని బాలినేని ఆరోపించడం దుర్మార్గం అన్నారు. వ్యక్తిగతంగా తానెప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, కమిషన్లకు కక్కుర్తిపడే నైజం తనది కాదని చెప్పారు.
పుట్టుకతోనే తాను శ్రీమంతుడిని అని, తమది 10మందికి అన్నం పెట్టే కుటుంబం అని గుర్తుచేశారు. నాలుగుసార్లు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యానని, ఒక్క అవినీతినైనా నిరూపించాలని సవాల్ విసిరారు. 'తనపై వ్యక్తిగత విమర్శలకు దిగితే బాలినేని బండారం బయటపెడుతానని, తాను గనుక పూర్తిగా మనసు పెడితే తట్టుకోవడం కష్టమని' హెచ్చరించారు.
ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని బాలినేనికి జనార్దన్ సూచించారు. ఇక కార్పోరేషన్ ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని, ఓడిపోయేవారే బాధపడాలని అన్నారు. కనీసం బాలినేని ఎక్కడ ఉంటాడన్నది కూడా తనకు తెలియదని, అమావాస్యకోసారి, సంవత్సరానికోసారి ఒంగోలుకు వచ్చి హడావుడి చేస్తుంటాడని ఎద్దేవా చేశారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఒంగోలు కోసం చేసేందేమి లేదన్నారు. బాలినేని చేయలేని పనులను తాను మూడు సంవత్సరాల్లో చేసి చూపించానని అన్నారు. సీఎం చంద్రబాబు హయాంలోనే రామతీర్థం గుండ్లకమ్మ ప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయని వెలుగొండ ప్రాజెక్టుకు పునాది వేశారని అన్నారు. తన అభివృద్ధి బాలినేని అవినీతిపై రెండు పార్టీల సీనియర్ నాయకులను కూర్చోబెట్టి.. ఎవరేంటో ప్రజాకోర్టులోనే తేల్చుకుందామని అన్నారు.
త్వరలోనే యరజర్లలో ట్రిపుల్ ఐటీకి సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అలాగే జీ+9 తరహాలో 7వేల మందికి పైగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. పొగాకు పంటకు జీఎస్టీ లేకుండా చేయడానికి త్వరలోనే ప్రధానితో సీఎం మాట్లాడనున్నారని అన్నారు.