చివరి బంతి అంటే అదే: కిరణ్పై దామోదర, శ్రీధర్ ఫైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి అంటే చివరి దాకా పదవిలో కొనసాగడమేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నేతల భవిష్యత్తుతో కిరణ్ కుమార్ రెడ్డి ఆడుకుంటున్నారని, వాస్తవాలు చెప్పడం లేదని ఆయన అన్నారు. మంత్రి ముఖేష్ గౌడ్తో కలిసి ఆయన శనివారంనాడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఈ నెల 10వ తేదీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని, సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి హీరో కాకుండా చూస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరగుతుందో లేదో చెప్పలేమని ఆయన అన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడిన సీమాంధ్ర కాంగ్రెసు నాయకులతో మాట్లాడడానికి తెలంగాణ నేతలు సిద్ధపడుతున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల గతంలో మంత్రులు ఇబ్బందులు పడిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు.
తెలంగాణకు సంబంధించి తాము తగిన వ్యూహాలు రూపొందించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పరిణామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. బిల్లుపై శాసనసభలో చర్చనే జరగకపోతే గడువు పొడగించే అవకాశం కూడా ఉండదని ఆయన అన్నారు.
తన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ిడ ఆమోదిస్తారో, చెత్తకుండీలో పడేస్తారో, పెండింగులో పెడితారో వారిష్టమని మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబు అన్నారు. ఆయన శనివారంనాడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. సభ జరగకపోతే రాతపూర్వకంగా అభిప్రాయాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అబివర్ణించారు. తాను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, విధులకు హాజరు కాబోనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణను అడ్డుకోవడానికే తన శాఖను మార్చారని శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. అఫిడవిట్లతో తెలంగాణను అడ్డుకోలేరని ఆయన అన్నారు.