టిడిపితో కిరణ్ చేతులుకలిపారు: దామోదర, శోభా ధ్వజం
అంతా అయిపోయిందనుకోవడానికి వీల్లేదు: శోభా
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుతో అంతా అయిపోయిందనుకోవడానికి ఏమాత్రం వీల్లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు. తాము విభజనకు పూర్తి వ్యతిరేకమన్నారు. విభజన బిల్లు వస్తే అడ్డుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదంటూ ఇంట్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. విభజన బిల్లు కంటే ముందే సమైక్యంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం పరిధిలో వద్దు: దానం
హైదరాబాదులో శాంతిభద్రతలను కేంద్ర పరిధిలో పెట్టాలని తెలంగాణ బిల్లులో ప్రతిపాదించడంపై మంత్రి దానం నాగేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా ఉందన్నారు. హైదరాబాదు నుంచి వచ్చే రెవెన్యూను పంచుకునే విషయం పైన బిల్లులో స్పష్టత లేదన్నారు. బిల్లుపై వెంటనే సభలో చర్చించాలన్నారు. ఆయన అంతకుముందు గవర్నర్ నరసింహన్ను కలిశారు.
అప్రజాస్వామికం: హరీష్ రావు
ముసాయిదా బిల్లును అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు అన్నారు. బిల్లు పైన చర్చ జరగాలన్నారు. చర్చ బాధ్యత సభాపతిదే అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు దొంగ నాటకులా కట్టిపెట్టాలన్నారు. చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతలతో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సీమాంధ్ర నేతలు వారికి ఏం కావాలో చెప్పాలన్నారు.
దురదృష్టకరం: అశోక్ బాబు
శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పెట్టడం దురదృష్టకరమని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు, ఎపిఎన్జీవోలు శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. 18, 19 తేదీల్లో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.