నాయకుడంటూ కిరణ్ రెడ్డిపై డిసిఎం దామోదర ధ్వజం
హైదరాబాద్: ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ప్రత్యేక రాష్ట్ర కల సాకారమవుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం జరిగిన 'తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ -2014' ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు.
'నాయకుడు' అంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. "2004లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తు సం దర్భంలో పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం చేర్చారని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతల ఆమోదంతోనే నాడు అధిష్ఠానం ఆ పని చేసిందని, నాడు లేని వ్యతిరేకత, అభ్యంతరం, ఆక్షేపణ రాష్ట్ర నాయకుడికి ఇప్పుడెందుకని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసమే ఆ నాయకుడు సమైక్యవాదాన్ని వినిపిస్తు న్నారని విమర్శించారు.
జీవోఎం ఎదుట సీమాంధ్రకు ఏం కావాలనేది చెప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వారి సమైక్యవాదం సీఎం కుర్చీ కోసం తప్ప ప్రజల కోసం కాదని విమర్సించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బరి తెగించి మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, జగన్బాబు సీమాంధ్ర సమస్యలపై చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మొదలు.. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీపక్ష నాయకులు సుష్మ, జైట్లీలు దాకా, అంతా ఇఫ్, బట్ అంటూ వంకలు పెట్టకుండా పార్లమెంటులో బిల్లుకు మద్దతునిస్తారని చెప్పారు.
తెలంగాణను ఎవరూ ఆపలేరని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. 'తెలంగాణ బిల్లు రాజ్యాంగ రథచక్రాలెక్కింది. మహోన్నత మాతృ హృదయంతో సోనియాగాంధీ తీసుకున్న సంకల్ప ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడనుంది' అని చెప్పారు. అసెంబ్లీ చర్చకు పత్ర ప్రాధాన్యమే ఉన్నదని, అది అభిప్రాయం చెప్పడానికే పరిమితమని అభిప్రాయపడ్డారు.
సీమాంద్రుల కుట్రలను తిప్పికొట్టే వజ్రాయుధంగా తెలంగాణ ఉద్యోగుల డైరీని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అభివర్ణించారు. "విఠలాచార్య సినిమాలో కత్తివిద్యలా ఉంది సీమాంద్రుల వైఖరి. వారు కొట్లాడేది అట్ట కత్తులతోనే. తెలంగాణ ఆగదని తెలిసీ వారు కుట్రలు చేస్తున్నారు' అని మండిపడ్డారు. ఈ కుట్రలను ఛేదించేందుకు, బిల్లులో సవరణలు సాధించేందుకు జనవరి ఏడో తేదీన ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.