టిలో కెసిఆర్ను ఏమంటారంటే..: ఏకిపారేసిన దామోదర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రచార సారథి దామోదర రాజనర్సింహ మంగళవారం నిప్పులు చెరిగారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మాభిమానాలను తుంగలో తొక్కిన కెసిఆర్ను మించిన విశ్వాసఘాతకుడు మరొకరు లేరన్నారు. తెలంగాణలో మాట తప్పిన వ్యక్తిని మోసగాడు అంటారని, ఇలామాట తప్పిన కెసిఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఆగమేనన్నారు.
మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నామినేషన్ వేసిన అనంతరం స్థానిక హౌసింగ్ బోర్డు మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న దామోదర ప్రసంగించారు. విశ్వాసానికి, విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు చెప్తారన్నారు. 2004లో కరీంనగర్ సభలో సోనియ తెలంగాణ ప్రజల మనసు తెలుసునని చెప్పినట్లుగానే రాష్ట్రాన్ని ప్రకటించి విశ్వాసం నిరూపించుకున్నారన్నారు.
సీమాంధ్రలో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రకటించారని కొనియాడారు. మాటకు విలువనిచ్చే తెలంగాణ ప్రజలు మాట తప్పిన కెసిఆర్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ ఇస్తే తెరాసను భేషరతుగా కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు మాటమార్చారన్నారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని పదేపదే ప్రకటించిన ఆయన కుటుంబ పాలనకు తెరతీశాడని నిప్పులు చెరిగారు.
అధికారం కోసం ఊహాలోకంలో విహరిస్తున్నాడన్నారు. తెలంగాణ అమరులు, ఐకాస, ప్రజాసంఘాల మనోభావాలు, త్యాగాలను అపహాస్యం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించాడని, రాష్ట్రం ఏర్పాటు కాగానే మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిఎం పీఠం కోసం కెసిఆర్ పగటి కలలు కంటున్నాడన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం అంటే దొరల గడీలను పునర్నిర్మించడం, భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడమేనా అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడ్డ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ త్యాగశీలి అని మాజీ మంత్రి జానారెడ్డి కొనియాడారు. రెండు ప్రాంతాల్లో పార్టీని త్యాగం చేసిన ఆమెకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.