దామోదర వ్యాఖ్యలు: సిఎం కిరణ్ రెడ్డి టార్గెట్
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్లో శుక్రవారం జరిగిన జైత్రయాత్ర సభలలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. మొత్తం రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ తెలంగాణ వ్యతిరేకిని, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకిని అని అంటున్నారని ఆయన ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి పదేళ్లు మాత్రం తెలంగాణ నాయకులు అధికారంలో ఉన్నారని, మిగతా కాలమంతా సీమాంధ్ర నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారని, అందువల్ల సమస్యల సృష్టికర్తలు వారేనని ఆయన అన్నారు.
సీమాంధ్ర నాయకులకు తెలంగాణ ఓట్లు కావాలి, పదవులు కావాలి గానీ తెలంగాణకు జరిగే అన్యాయం, తెలంగాణలో అమలవుతున్న అసమతుల్యత అవసరం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ కావాలని వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభ్యులను సోనియా వద్దకు పంపించారని, 2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణను చేర్చి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నామని, 2009 ఎన్నికల ప్రణాళికలో కూడా తెలంగాణ ఉందని, అప్పుడు సీమాంధ్ర నాయకులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయన అంటూ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు.
హైదరాబాదుకు 400 ఏళ్ల చరిత్ర ఉందని, హైదరాబాద్ సంస్కృతి చాలా గొప్పదని, తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉన్నవారంతా స్థానికులేనని ఆయన అన్నారు. మాట మీద నిలబడే సత్తా కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. సోనియా చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశంసించారు.
తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని సీనియర్ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరగడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని ఆయన విమర్సించారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఏ విధంగా ముఖ్యమంత్రివి అయ్యావంటే ఏం చెప్తావని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. సోనియా గాంధీకి అండగా నిలబడాలని ఆయన ప్రజలను కోరారు. సోనియాపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సోనియాను కోరారు.