దామోదర వినతి: మెదక్ బరిలో సతీమణి పద్మినీరెడ్డి!
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల బరిలో తన భార్య పద్మినీ రెడ్డిని దించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పద్మినీరెడ్డికి మెదక్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే వినతులు పంపినట్లు సమాచారం. పద్మినీ రెడ్డి గత కొంత కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సంగారెడ్డి శాసనసభ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ తీవ్రంగా యత్నించారు. కుటుంబానికి ఒకటే టికెట్ నిర్ణయం కారణంగా ఆమెకు టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో పోటీ యోచనను విరమించుకున్నారు.
కాగా, తాజాగా మెదక్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని దామోదరపై ఒత్తిడి వస్తోంది. టికెట్ ఇస్తే తాను పోటీకి సిద్ధమేనని ఆయన ఇటీవల పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు తెలిపారు. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసినందున మళ్లీ బరిలోకి దిగడం కంటే తన భార్యను నిలపడం మంచిదని దామోదర భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే ఆయన చర్చించినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా మెదక్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జైపాల్ రెడ్డితోపాటు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ పిసిసి నేతలు ఆదివారం తుది కసరత్తు చేసి అధిష్టానానికి పేర్లను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.