హైదరాబాద్పై ఆంక్షలు వద్దు: దానం, టిపై 12న: గండ్ర
హైదరాబాద్: రాష్ట్ర విభజన వ్యవహారంలో హైదరాబాద్పై ఆంక్షలు విధించడాన్ని హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ వ్యతిరేకించారు. జిహెచ్ఎంసి పరిధిని కేంద్ర పాలనలో పెట్టే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ విధమైన ఆంక్షలు లేవని, అలాంటిది ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల రక్షణకు తాను భరోసా ఇస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై తిరిగి ఆలోచన చేయకపోతే హైదరాబాదులో ఘర్షణలకు పునాదులు పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ఈ నెల 12వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై చర్చిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ముందుగా ముసాయిదా బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
శాసనసభా సమావేశాల్లో తెలంగాణ బిల్లు కన్నా ప్రాధాన్యత కలిగిన అంశం మరోటి లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించి విభజనకు సహకరించాలని ఆయన కోరారు. తమ కాంగ్రెసు అధిష్టానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి నడుచుకుంటారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.