కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం: మనుషులతోపాటు పశువులు కూడా, పడవలకు కట్టి ఈడ్చుకుంటూ..
అమరావతి: కుటుంబంలో మనిషిలో చూసుకునే పాడి పశువుల పట్ల వాటి యజమానులు కొందరు అమానుషంగా వ్యవహరించారు. తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూరు వైపు కృష్ణా నదిలో ప్రమాదకరంగా పడవలకు కట్టుకుని పశువులను తీసుకెళ్లారు.
పశువులను నదిలో ఈడ్చుకుంటూ..
కొల్లాపూర్ మండలం సోమశిలకు సమీపంలోని నది ఒడ్డు నుంచి అవతలి వైపునకు మరబోటు సహా నాటు పడవలో మనుషులు ప్రయాణిస్తూ మూగ జీవాలను మాత్రం పడవ వెంట నీటిలోనే తీసుకెళ్తున్న దృశ్యాలను కొందరు ఫొటోలు, వీడియోలు తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం అక్కడికి వెళ్లిన కొందరు వీడియో గ్రాఫర్లు ఈ ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రమాదమని తెలిసినా..
కాగా, ప్రతి బుధవారం సింగోటంలో పశువుల సంత జరుగుతుంది. దీనిలో పశువులను కొనుగోలు చేసే రైతులు మూగజీవాలను ఇలా తరలిస్తూ నది దాటిస్తుండటం వీరికి సాధారణంగా మారిపోయింది. రోడ్డు మార్గం ద్వారా నది అవతలి వైపునకు వెళ్లాలంటే సుమారు 200 కి.మీ ప్రయాణించాల్సి ఉండటం, నదిలో అయితే కేవలం 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అవతలి ఒడ్డుకు చేరే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నదీ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. అంతేగాక, తక్కువ ఖర్చుతోనే గమ్యాన్ని చేరుకుంటుండటంతో ప్రమాదకరమైనా ఈ ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు.
ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా..
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్ప పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు కూడా అలాగే నిర్లక్ష్యం వ్యవహరిస్తుండటం విమర్శలు వినిపిస్తున్నాయ. అయితే, పడవల్లో అధికంగా ప్రయాణిస్తున్న మనుషుల ప్రాణాలతోపాటు మూగ జీవాల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంతదూరం ఈదలేని మూగజీవాలు మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలే పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. మూగజీవాలను ఈ రకంగా హింసించడం సరికాదని, అధికారులు ఈ విషయంపై దృష్టిసారించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.