బాబు చిల్లర పనులతో మన పరువు పోయింది: ధర్మాన
జమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిల్లర పనులతో పరువు పోయిందని వైసిపి నేత ధర్మాన ప్రసాద రావు మంగళవారం నాడు ధ్వజమెత్తారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, పట్టిసీమలో కమీషన్లు కొట్టేసి అనైతిక పనులు చేస్తున్నారన్నారు.
అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మంగళవారం ఉదయం కాకినాడలో వైసిపి తలపెట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, పట్టిసీమలో కమిషన్లకు కక్కుర్తి పడటం మినహా చంద్రబాబు సర్కారు మరేమీ చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడాలని సలహా ఇస్తున్నారని, అసలు హోదా కోసం పోరాడాల్సింది ఎవరని ప్రశ్నించారు.
కేంద్రంలో మంత్రి పదవులు, కేసుల భయంతో రాష్ట్రాన్ని గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పేందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. హోదా వచ్చేంత వరకూ పోరాడాలని తమ నేత జగన్ నిర్ణయించారన్నారు. బాబు చిల్లర పనులతో కేంద్రంలో పరపతి పోయిందన్నారు.
హోదా లేకపోవడం వల్ల గత రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నత పోరాటం చేయాల్సిన వ్యక్తి చంద్రబాబు అని, కానీ చిల్లర పదవులు, మంత్రి పదవుల కోసం నోరు మెదపడం లేదని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు పోరాడటం లేదు కనుకే జగన్ ప్రజల తరఫున గొంతెత్తుతున్నారన్నారు.