శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్తో దర్శనం
తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 80 రోజుల తరువాత సప్తగిరుల్లో గోవిందుడి నామస్మరణ మారుమోగిపోతోంది. ఏడుకొండల వాడి సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది. పరిమితంగానే అయినప్పటికీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు సోమవారం నుంచి భక్తుల రాక ఆరంభమైంది. ఒక్క తిరుమల కాదు.. తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలన్నింట్లోనూ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.
టీటీడీ స్థానిక ఆలయాను దర్శించుకోవడం ఇలా..
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాలలో భక్తుల దర్శనానికి ఇవ్వాళ పునఃప్రారంభం అయ్యాయి. భక్తులకు ఆన్లైన్, ఎస్ఎమ్ఎస్ల ద్వారా సమాచారాన్నిచేరవేస్తారు.
ఆలయ ప్రాంగణాల్లో పీఓఎస్ మిషన్లు
ఆయా ఆలయాల ప్రాంగణంలో నిర్థేశిత పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) మిషన్ల ద్వారా ఈ నెల 30వ తేదీ వరకు దర్శనం టోకెన్లను జారీ చేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ https:/tirupatibalaji.ap.gov.in ద్వారా స్థానిక ఆలయాలలో దర్శనం టోకెన్లు పొందవచ్చు. 7304562222కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా ఆన్లైన్ టికెట్లను పొందవచ్చు. స్లాట్కు అనుగుణంగా టికెట్లను జారీ చేస్తారు. దీనికోసం
TTD (space) Temple Name (Space) Date (space) Number of persons టైప్ చేసి 7304562222 నంబర్కు ఎస్ఎమ్.ఎస్ చేయాలి.
ఆలయాల దర్శనం వివరాలిలా..
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. మధ్యహ్నం 12.00 నుంచి 12.30 గంటల వరకు అమ్మవారి నైవేద్య విరామం ఉంటుంది. శుక్రవారం విశేష రోజు కావడం వల్ల ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు భక్తులకు 125 బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 10.00 నుంచి 11.00 గంటల వరకు స్వామివారి కైంకర్యాల విరామాన్ని ప్రకటిస్తారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం 10వ తేదీ వరకు ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. జూన్ 11వ తేదీ నుంచి మార్పులు చేస్తారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామివారి నైవేద్య విరామం ఉంటుంది.
Recommended Video
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో
ప్రతిరోజు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 11.00 నుండి 11.30 గంటల వరకు స్వామివారి కైంకర్యాల విరామం ప్రకటిస్తారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామివారి కైంకర్యాల విరామం తీసుకుంటారు. శుక్రవారం ఉదయం 9.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు, శనివారం ఉదయం 8.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు.