కాపు కార్యాచరణకు దాసరి, చిరు 'సై', రాజమహేంద్రవరం మీటింగ్ కు రెడీ
శ్రీకాకుళం : ఓవైపు ప్రత్యేక హోదానా..? ప్యాకేజీనా అన్న చర్చలు..! మరోవైపు మరోసారి కాపు ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ప్రయత్నాలు. ఈ రెండింటి నడుమ 9వ తేదీన జరగబోయే కాకినాడ సభలో పవన్ ఏ అంశాలపై ఎలా స్పందిస్తారన్న మరో ఉత్కంఠ. మొత్తానికి ఏపీలో ఇప్పుడు హైటెన్షన్ పాలిటిక్స్ అందరి బుర్రలను వేడెక్కిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 11న నిర్వహించబోయే రాష్ట్రస్థాయి కాపు నేతల సమావేశంపై అందరి దృష్టి నిలిచి ఉంది. ఇందుకోసం జేఏసీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశం కోసం కాపు నేతలు దాసరి, చిరంజీవి హాజరవుతున్నట్లుగా జేఏసీ నేతలు ప్రకటించారు.
ఈ ఇద్దరు నేతలతో పాటు పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు కూడా సమావేశంలో భాగస్వామ్యం కాబోతున్నారని జేఏసీ నేతలు తెలిపారు. మంగళవారం నాడు వైఎస్సార్ కళ్యాణమండపంలో జరిగిన రాష్ట్ర కాపు జేఏసీ సమావేశ అనంతరం జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్బంగా ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో 70 ఏళ్లుగా ఉద్యమిస్తున్నామన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఈ కులాలన్ని బీసీ జాబితాలో ఉంటే.. ఏపీలో మాత్రం ఓసీలుగా ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ముద్రగడ గత కొన్నేళ్లుగా కాపుల కోసం ఉద్యమిస్తున్నారని అన్నారు.
అగస్ట్ నెలతో ప్రభుత్వానికి ముద్రగడ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయినా.. హామిలను నిలబెట్టుకోవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవడం దారుణమన్నారు ఆకుల రామకృష్ణ. రాజమహేంద్రవరం వేదిక నుంచే భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.