పెళ్లికి ముందు నుంచే తెలుసు.. ఎన్టీఆర్ లాగే క్రమశిక్షణతో!: దాసరిపై చంద్రబాబు..
సినీ జగత్తులో తనకంటూ విశిష్ట స్థానం ఏర్పరుచుకున్న విలక్షణ దర్శకుడు దాసరి నారాయణరావు మరణం అటు సినీ ప్రేమికులతో పాటు ఇటు రాజకీయ రంగ ప్రముఖులను శోకసంద్రంలో ముంచింది.
హైదరాబాద్: సినీ జగత్తులో తనకంటూ విశిష్ట స్థానం ఏర్పరుచుకున్న విలక్షణ దర్శకుడు దాసరి నారాయణరావు మరణం అటు సినీ ప్రేమికులతో పాటు ఇటు రాజకీయ రంగ ప్రముఖులను శోకసంద్రంలో ముంచింది. దర్శకుడిగా, నాటక ప్రయోక్తగా, నటుడిగా, కేంద్రమంత్రిగా, పాత్రికేయుడిగా.. మొత్తంగా ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిగా దాసరి ఎదిగిన తీరు ఎవరికైనా ఆదర్శనీయం.
ఒకవిధంగా తెలుగు సినీ పరిశ్రమకు దాసరి చాన్నాళ్లుగా పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. అలాంటి వ్యక్తి కన్నుమూశారని తెలియగానే ఆయన అభిమానులు, ఆప్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పలువురు ప్రముఖులు దాసరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దాసరితో తమ అనుబంధాన్ని, ఆయన ఎదిగిన తీరును మరోసారి వారు గుర్తు చేసుకుంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే
బొత్స నారాయణ దాసరితో తన అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం.. బొత్స మీడియాతో మాట్లాడారు. దాసరితో తన అనుబంధం చాలా విలువైనదని పేర్కొన్నారు.సమస్య ఏదైనా ఆయన ధైర్యాన్నిచ్చేవారని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి.. తాము ధైర్యాన్ని కోల్పోయామని అన్నారు.
దాసరి పులి లాంటి వ్యక్తి:
దాసరి నైజం గురించి చెబుతూ.. ఆయనో పులిలా ఉండేవారని బొత్స కొనియాడారు. తమ సామాజికవర్గానికి కూడా దాసరి పెద్ద దిక్కులా ఉన్నారని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం తమకు తీరని లోటు అని ఆవేదన చెందారు.
ఎన్టీరామారావు లాగే:
ఎన్టీఆర్ లాగే దాసరి కూడా ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దాసరి ఒక మహానీయుడని కితాబిచ్చారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి ఇటీవలే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినట్లు తెలిపారు.
జన్మభూమి పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో దాసరితో ఓ పాట రాయించాలని తాను భావించినట్లు చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన్ను సంప్రదించామని, తమ కోరిక మేరకు మంచి గీతాన్ని రాసిచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముందు నుంచే తెలుసు:
తనకు వివాహం కాక ముందు నుంచే దాసరితో పరిచయం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. దాసరి మరణవార్తతో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అంతకుముందు ఓ సందేశం ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. బుధవారం సాయంత్రం దాసరి అంత్యక్రియలు జరగనుండగా.. సీఎం చంద్రబాబు మధ్యాహ్నాం వరకు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేయనున్నారు.