కాపు ఉద్యమంలో నిజాయితీ: ముద్రగడను కలిసిన దాసరి
కిర్లంపూడి: కాపు ఉద్యమంలో నిజాయితీ ఉందని, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం కాపు కార్పోరేషన్కు రూ. 2 వేల కోట్లు ఇవ్వడంతో పాటు కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు డిమాండ్ చేశారు.
కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంను దాసరి నారాయణ రావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కిర్లంపూడిలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
కాపుల రిజర్వేషన్పై ముద్రగడ రాసిన లేఖకు చంద్రబాబు అప్పుడే స్పందించి ఉంటే, సమస్య ఇంత వరకూ వచ్చేది కాదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను కాపులు నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాపు ఉద్యమంలో నిజాయితీ ఉందన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్ కు రూ. 2 వేల కోట్లు ఇవ్వడంతో పాటు కాపులను బీసీల్లో చేర్చాలని దాసరి డిమాండ్ చేశారు. నిజంగా ఇది ముద్రగడ విజయమని అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు.
అరు నెలల్లో సమస్యను పరిష్కరిస్తానన్న చంద్రబాబునాయుడు ఇరవై రెండు నెలలైనా స్పందించకపోవడంతో ముద్రగడ దీక్షకు దిగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముద్రగడతో ప్రభుత్వం జరిపిన చర్చల అనంతరం సోమవారం దీక్ష విరమించిన విషయం తెలిసిందే.