రాజకీయాల్లో ఇదీ దాసరి: చిరంజీవితో దూరం నుంచి దగ్గరి దాకా...
దివంగత దాసరి నారాయణ రావు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అలాగే రాజకీయ రంగంలోను అడుగిడి తానేమిటో నిరూపించుకున్నారు. ఆయన ఓసారి కేంద్రమంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.
హైదరాబాద్: దివంగత దాసరి నారాయణ రావు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అలాగే రాజకీయ రంగంలోను అడుగిడి తానేమిటో నిరూపించుకున్నారు. ఆయన ఓసారి కేంద్రమంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.
చదవండి: దాసరి మృతి: వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు
ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. పలు సందర్భాల్లో పేర్లు చెప్పకుండా వారికి తగిలేలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజకీయాల్లో అందలం ఎక్కించింది.
ఆయన కోసం కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీకి దాసరి రాజకీయంగా ఉపయోగపడ్డారు. ఆయన సామాజిక వర్గం లేదా ఆయనకు తెలుగు ప్రజల్లో ఉన్న అభిమానం ఆ పార్టీకి ఉపయోగపడుతుందని కూడా ఆ పార్టీ భావించిందని చెప్పవచ్చు.
అదొక్కడే మచ్చ
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే బొగ్గు కుంభకోణం ఆయనకు మచ్చగా మిగిలింది. ఈ కేసులో ఆయన నివాసం, కార్యాలయాల్లో విచారణ అధికారులు సోదాలు కూడా చేశారు.
చిరంజీవి వచ్చే దాకా దాసరికి కాంగ్రెస్ ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీ దాసరికి మొదటి నుంచి మంచి ప్రాధాన్యం కల్పించింది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అనంతరం 2011లో చిరంజీవి తన పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పడే దాసరి ప్రాధాన్యం తగ్గిందనే వాదనలు ఉన్నాయి.
తర్వాత దగ్గరయ్యారు..
దాసరి - చిరంజీవిలకు చాలాకాలంగా విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. అయితే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని కోరుతూ కాపు నేతలు ఒక్కటయ్యారు. ఈ సమయంలో దాసరి - చిరులు ఒక్కటిగా నిలిచారు. ఆ తర్వాత వారి మధ్య మంచి సంబంధాలు కనిపించాయి. ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో దాసరికి మంచి సంబంధాలు ఉన్నాయి. చిరుతో విభేదాలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని భావించారు. ఆ తర్వాత చిరంజీవితోను మంచి సంబంధాలు కనిపించాయి.
దాసరి నివాసానికి పార్థివ దేహం
కాగా, దాసరి పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలిస్తారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాసరి మృతికి సంతాపంగా రేపు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ, థియేటర్ల బంద్ పాటించనున్నాయి.