వాళ్లెవరూ ఊహించలేదు.. ఆరోజు ఉదయం పాత్రికేయులతో దాసరి భోజనం!
పాత్రికేయులతో సమావేశానంతరం భోజన సమయంలోను దాసరి ఉద్యోగులను ఆశ్చర్యపరిచారు. తొలుత దాసరి కోసం ఓ ఏసీ గదిలో ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయగా.. దాసరి మాత్రం ఉద్యోగులతో కలిసే తినేందుకే మొగ్గుచూపారు.
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ రంగంతో పాటు అటు సామాజిక, రాజకీయ రంగాల్లోను తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా పాత్రికేయ రంగంలో 'ఉదయం'తో ఆయన తెరలేపిన సంచలనం గురించి ఇప్పటికీ జనం మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం ఆయా మీడియా విభాగాల్లో పనిచేస్తున్న ఎంతోమంది నిష్ణాతులైన జర్నలిస్టులు ఉదయం మూలాల్లోంచి వచ్చినవారే.
రామోజీ ఈనాడును సవాల్ చేసిన దాసరి ఉదయం డైలీ
ఈనాడు జర్నలిజాన్ని ధీటుగా ఎదుర్కొని పత్రికను నడిపించిన దాసరి దాన్ని జనానికి దగ్గర చేయడంలో సఫలమయ్యారు. ఒక యజమానిగా కాక.. ఉదయంలోని పాత్రికేయులందరిని ఆయన తన కుటుంబ సభ్యుల్లా భావించేవారని చాలామంది చెబుతుంటారు. దాసరి మృతి నేపథ్యంలో.. ఉదయంతో ఆయన అనుబంధాన్ని తెలిపే ఒక వార్తా కథనం ఒకటి ఆసక్తికరంగా మారింది.
పాత్రికేయులతో సమావేశం:
ఓరోజు చెన్నై నుంచి విజయవాడ బందరు రోడ్డులోని ఉదయం దినపత్రిక కార్యాలయానికి వచ్చారు దాసరి. అక్కడి పాత్రికేయులతో సమావేశం కోసం అక్కడికి రావాల్సి వచ్చింది. మధ్యాహ్నాం వరకు పాత్రికేయులు, ఇతర సిబ్బందితో సమావేశం జరిగింది. పత్రిక అధిపతితో సమావేశం కాబట్టి సహజంగానే పాత్రికేయుల్లో కాస్త బెరుకు. కానీ సమావేశం ముగిసిన తర్వాత వారి అభిప్రాయం మారిపోయింది. దాసరి ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో వారికి అర్థమైంది.
ఉద్యోగులతో కలిసి భోజనం:
ఇక పాత్రికేయులతో సమావేశానంతరం భోజన సమయంలోను దాసరి ఉద్యోగులను ఆశ్చర్యపరిచారు. తొలుత దాసరి కోసం ఓ ఏసీ గదిలో ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయగా.. దాసరి మాత్రం ఉద్యోగులతో కలిసే తినేందుకే మొగ్గుచూపారు. తన ఛాంబర్ పక్కనున్న హాలులో కూర్చొని.. ఉద్యోగులందరిని భోజనానికి పిలిచారు దాసరి. ఆపై అంతా కలిసి అక్కడే భోజనం చేశారు.
గుర్తు చేసుకుంటున్న ఉదయం జర్నలిస్టులు:
ఒక పత్రికా అధిపతి ఇలా కింది స్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగులందరితో కలిసి భోజనం చేయడం అప్పట్లో సంచలనంగా కూడా మారింది. దాసరి మరణం నేపథ్యంలో ఆయనతో అనుబంధాన్ని ఒకప్పటి ఉదయం ఉద్యోగులు ఇలా మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
ఈనాడుపై ఆరోపణలు:
ఉదయం పత్రిక దాసరి చేతుల నుంచి మాగుంట సుబ్బరామిరెడ్డికి చేతుల్లోకి మారాక పత్రికకు గడ్డు పరిస్థితులు ఏర్పడినట్లు చెబుతారు. పత్రికను నడిపిస్తున్న సుబ్బరామిరెడ్డి ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఈనాడు వ్యవహరించందన్న ఆరోపణలున్నాయి. పత్రికా రంగంలో ఈనాడు-ఉదయం మధ్య నెలకొన్న పోటీ ఈ పరిస్థితికి దారి తీసిందని చెబుతారు. పత్రికా రంగంలో ఒక సంచలనం సృష్టించిన ఉదయం.. అర్థాంతరంగా ఆగిపోవడం ఇప్పటికీ చాలామందిని కలచివేస్తూనే ఉంటుంది.