డేటా చోరీలో కీలక ఆధారాలు, ఎంత పెద్దవారున్నా వదలం, ఏపీలో అసలేం చేశారంటే..: సీపీ
హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ పైన విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం వెల్లడించారు. తమ విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించామని చెప్పారు. వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తేలిందన్నారు. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్నారు. నియోజకవర్గాలవారీగా వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారని చెప్పారు.
'జగన్ కోసం టీడీపీ డాటా దొంగిలించే యత్నం.. తెరముందే టీ పోలీసులు.. తెరవెనుక చక్రం'
అమెజాన్ సర్వీసెస్కు నోటీసులు
ఐటీ గ్రిడ్కు సంబంధించిన డేటాను అమెజాన్ సర్వీసెస్లో భద్రపరుస్తున్నారని సీపీ సజ్జనార్ చెప్పారు. ఓటరు తొలగింపుపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై ఆధార్ సంస్థతో పాటు ఎన్నికల సంఘానికి సమాచారం కోసం లేఖ రాశామని చెప్పారు. అమెజాన్ సర్వీసెస్కు కూడా నోటీసులు అందించామని తెలిపారు.
అవసరమైతే అరెస్టులు ఉంటాయి
ఐటీ గ్రిడ్ ద్వారా ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో తెలుసుకుంటున్నారని సజ్జనార్ చెప్పారు. ఓటరు జనసేనకు అనుకూలమా, టీడీపీకి అనుకూలమా, వైసీపీకి అనుకూలమా తెలుసుంటున్నారని చెప్పారు. అవసరమైతే ఈ కేసులో అరెస్టులు ఉంటాయని చెప్పారు. ఓటర్ల కులం, ఫోన్ నెంబర్, అడ్రస్ సేకరించారన్నారు. ఐటీ గ్రిడ్ నుంచి సేకరించిన వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు.
సెన్సిటివ్ డేటా.. ఎంత పెద్దవారున్నా వదిలేది లేదు
సున్నితమైన డేటాను పబ్లిక్లో ఎందుకు పెట్టారని సజ్జనార్ అన్నారు. ఈ కేసుల్లో ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగత సమాచారన్ని దుర్వినియోగం చేస్తున్నారని తేలిందన్నారు. ఆధార్ డేటా, ఓటర్ డేటా ఎలా సేకరించారో చెప్పాలన్నారు. సెన్సిటివ్ డేటాను ప్రయివేటు కంపెనీలకు ఎలా అప్పగిస్తారో చెప్పాలన్నారు. ఏపీ లబ్ధిదారుల (సంక్షేమ పథకాలు) డేటా ప్రయివేటు వ్యక్తుల వద్దకు ఎలా వచ్చిందన్నారు. ఓట్ల వివరాలు ఎందుకు దగ్గర ఉంచుకున్నారో విచారిస్తున్నామన్నారు.
విదేశాల నుంచి నేరస్తులను తెచ్చాం.. పక్క రాష్ట్రం నుంచి తీసుకురాలేమా
ఈ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ తనకు తానుగా లొంగిపోవాలని సజ్జనార్ చెప్పారు. తాము విదేశాల్లో ఉన్న నేరస్తులనే పట్టుకు వస్తున్నామని, పక్క రాష్ట్రంలో (ఏపీ) ఉంటే తీసుకు రాలేమా అన్నారు. అశోక్ ఏపీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ అలా చెప్పారు. ఏపీ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డేటా ప్రయివేటు వ్యక్తుల చేతికి ఎలా వచ్చాయన్నారు. ఈ డేటా చోరీ వెనుక ఎవరున్నాపట్టుకుంటామన్నారు.
కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్లు సీజ్ చేశాం
ఐటీ గ్రిడ్కు చెందిన నలుగురు ఉద్యోగులను తాము విచారించామని సీపీ సజ్జనార్ తెలిపారు. సంస్థలోని ట్యాబ్, సీపీయూ, కొన్ని మొబైల్ ఫోన్లు సీజ్ చేశామని, ఐటీ గ్రిడ్ సేకరించిన వాటికి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని చెప్పారు. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో తాము ఐటీ గ్రిడ్లో సోదాలు చేశామని చెప్పారు. ఆ సమయంలో కంపెనీలో నలుగురు ఉద్యోగాలు ఉన్నారన్నారు. కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్లు సీజ్ చేశామన్నారు.