డేటా చోరీ: వెలుగులోకి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు... జగన్, ఇదీ ఫాం7 అంటే
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపించేకొద్ది తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయవేడి రాజుకుంది. పార్టీల మధ్య కాదు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కూడా మాటల యుద్దం నడుస్తుంది. ఓట్ల గల్లంతు, ఐటీ గ్రిడ్ అంశంపై వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
డేటా చోరీలో కీలక మలుపు: తెలంగాణ ప్రభుత్వానికి షాకివ్వనున్న టీడీపీ, సంచలన నిర్ణయం
ఎన్నో ఆశ్చర్యకర వాస్తవాలు బయటకు వచ్చాయి
ఏపీ సీఎం చంద్రబాబు సైబర్ క్రైమ్ చేశారని జగన్ దుయ్యబట్టారు. రెండేళ్ళుగా ఇలా చేస్తున్నారన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలు జరిగాయని, ఎన్నో ఆశ్చర్యకర వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పారు. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్లో ఉండకూడని డేటా ఉందని, ఆధార్ వంటి డేటా ఉందని చెప్పారు. ప్రయివేటు వ్యక్తుల వద్ద, ప్రయివేటు కంపెనీల వద్ద ఉండని సమాచారం సేవామిత్ర యాప్లో ఉందని, ఐటీ గ్రిడ్ కంపెనీలో దొరికిందని చెప్పారు. ఓ ప్రయివేటు కంపెనీ వద్ద ఈ సమాచారం ఎలా దొరుకుతుందో చెప్పాలన్నారు. ఆధార్ డేటాతో పాటు ఓటర్ల ఐడీ డేటా, కలర్ ఫోటోలతో సహా వస్తోందన్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజల అకౌంట్ల వివరాలు సేవామిత్రలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
గతంలో ఎప్పుడూ ఇలా సైబర్ క్రైమ్ జరగలేదు
సీఎం స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా అని జగన్ అన్నారు. గవర్నర్కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చామని, దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదన్నారు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారన్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదని, చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలన్నారు.
ఇంటింటికి పంపి సర్వేలు చేయించి డేటా తీసుకున్నారు
ప్రభుత్వమే ఇంటింటికి పంపించి, సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్రలో పొందుపరిచారని జగన్ అన్నారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంశాన్ని సర్వే ద్వారా సేకరించారన్నారు. ఆ తర్వాత వారి ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపారన్నారు. రెండేళ్ల నుంచి పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారన్నారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారన్నారు. తాము ఎన్నికల కమిషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రయివేటు సంస్థల ఉండకూడనిది ఐటీ గ్రిడ్ వద్ద ఎలా ఉందని నిలదీశారు.
ఓ పద్ధతి ప్రకారం రెండేళ్లుగా ఓట్ల తొలగింపు
వారికి అనుకూలంగా ఓటు వేస్తారని అనిపిస్తే అలాంటి వారి ఓట్లు ఒకటికి రెండు అవుతున్నాయని, అనుకూలంగా లేని వారి ఓట్లను పద్ధతి ప్రకారం తొలగిస్తూ వస్తున్నారని జగన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో తాము కేవలం ఒక శాతం ఓట్లతో మాత్రమే ఓడిపోయామని, అంటే కేవలం 5 లక్షల ఓట్లతో మాత్రమే ఓడామని, కాబట్టి తాము ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. డూప్లికేట్ ఓట్లు భారీగా పెరిగినట్లు తాము గుర్తించామని చెప్పారు. డూప్లికేట్ ఓట్లపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని, ఈసీకి ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని, దీంతో మరోసారి ఫిర్యాదు చేశామన్నారు. ఓ సీఎంగా ఇలా ఏపీ ప్రజల కీలక సమాచారాన్ని ప్రయివేటు కంపెనీలకు ఇవ్వడం సరికాదని, అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. ఇవన్నీ నేరాలు కాదా అన్నారు.
ఏపీ, తెలంగాణ మధ్య యుద్ధమంటారా?
చంద్రబాబు చేయకూడని తప్పు చేస్తూ, నేరం ఆయన చేసి, ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్ధం అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారని, ఇదేమిటని జగన్ మండిపడ్డారు. హైదరాబాదులో ఉంటూ నువ్వు నేరాలు చేయవచ్చా అని ప్రశ్నించారు. మీరే నేరాలు చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఏపీ, తెలంగాణల మధ్య గొడవగా చెబుతారా అని మండిపడ్డారు. తెలంగాణలో ఐటీ గ్రిడ్ కార్యాలయం ఉంది కాబట్టి, ఇక్కడే ఫిర్యాదు చేశారన్నారు. దీనిని ఏపీ, తెలంగాణ మధ్య గొడవ అంటారా అన్నారు.
ఇదీ ఫాం7 అంటే
డూప్లికేట్ ఓట్లను గుర్తించాలనే ఫాం7ను పెట్టామని జగన్ చెప్పారు. మా వాళ్ల ఓట్లు తొలగించారని, దీనిపై విచారణ జరిపించాలని, విచారణ జరిగాక ఇందులో తప్పున్నాయని తెలిస్తే తీసేయమని చెప్పడమే ఫాం7 అన్నారు. ఫాం 7 అంటే మనం ఫైల్ చేయగానే వెంటనే ఓటును తీసివేయరని చెప్పారు. ఫాం 7 అంటే విచారణ కోరుకోవడం అన్నారు. దీంతో ఈసీ వచ్చి విచారణ జరుపుతారని, ఆ తర్వాత ఓట్లు తొలగిస్తారన్నారు. ఫాం 7 ఫైల్ చేయడం తప్పు కాదని, నేరం కాదన్నారు. అసలు ప్రజల ఆధార్, బ్యాంకు అకౌంట్లు తీసుకోవడం అసలు తప్పు అని, అది చంద్రబాబు చేసిన తప్పు అన్నారు.