సోషల్ మీడియాను హిలాయించేస్తోన్న 23
బెంగళూరు: మనం రోజూ చూసే క్యాలెండర్లో కనిపించే వాటిల్లో ఒకే ఒక్క తేదీ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న తేదీ అది. రాజకీయ నేతల గుండెల్లో గుబులు, దిగులును జాయింట్గా పుట్టిస్తోంది. అదే.. 23. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ అంకె షేక్ చేసి అవతల పడేస్తోంది. దీనికి ప్రధాన కారణం- కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేసిన రోజు కావడం.. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం పతనమైన తేదీ కావడం.
మే 23 చంద్రబాబు సర్కార్ పతనం
మే 23..చంద్రబాబు సర్కార్ దారుణ పరాజయాన్ని చవి చూసిన రోజు. రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒకేసారి వెలువడిన రోజు అది. ఎన్నికల ఫలితాలు ఎలాంటివనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. 102 మంది శాసనసభ్యులతో అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించిన చంద్రబాబు అప్పటి ఎన్నికల ఫలితాల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినది 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంతే మొత్తంలో ఎమ్మెల్యేలను లాక్కున్న సంఖ్య కూడా అదే కావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
జులై 23 కుమార రాజీనామా
జులై 23..చంద్రబాబు దోస్త్ కుమారస్వామి ప్రభుత్వం పతనమైన రోజు. 2018లో కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, జనతాదళ్.. ఈ మూడు పార్టీల్లో ఏ ఒక్కదానికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 112 సభ్యుల మేజిక్ ఫిగర్ దక్కలేదు. 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చతికిల పడింది. ఫలితంగా.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కట్టాయి.
అధికారాన్ని అందుకున్నా..
ఈ రెండు పార్టీలకూ 116 మంది సభ్యుల బలం ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు స్వయంగా హాజరు కావడం.. దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావడానికీ బీజం పడింది అప్పుడే. అయినప్పటికీ- కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయింది. బీజేపీ నాయకుల ఆపరేషన్ కమల ముందు నిలవలేకపోయింది. సొంత కూటమిలో చిచ్చు పెట్టుకుంది. అంతర్గత కుమ్ములాటలతో కుప్పకూలింది. అధికారాన్ని అందుకున్న 14 నెలలకే పతనమైంది. ఆ పతనమైన రోజు కూడా 23 కావడం యాదృశ్చికంగానే భావించుకోవచ్చు.
23న ఇంకెన్ని చూడాల్సి వస్తుందో..
ఇక చంద్రబాబు స్నేహితులు మరో ఇద్దరు అధికారంలో ఉన్నారు వారే- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ రెండు ప్రభుత్వాలు కూడా పూర్తికాలం పాటు మనుగడ సాగించలేవని జోస్యం చెబుతున్నారు నెటిజన్లు, ట్విట్టరెట్టీలు. ఏ 23వ తేదీ నాడో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్లు అధికారాన్ని కోల్పోవడం తథ్యమని అంటున్నారు. చంద్రబాబుతో దోస్తీ కట్టడం, 23వ తేదీ నాడే కుమారస్వామి ప్రభుత్వం పతనం కావడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. రాజకీయాల్లో 23వ తేదీ నాడు ఇంకెన్ని ప్రకంపనలు చూడాల్సి వస్తుందోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
నారా లోకేష్ పుట్టినరోజు 23 కావడం..
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు కూడా 23 కావడం నెటిజన్లు, ట్విట్టరెట్టీలకు మరో వరంలా దొరికింది. నారా లోకేష్ పుట్టినరోజు 23 కావడం వల్లే ఇలాంటి ఫలితాలు వెలువడుతున్నాయని అంటున్న వారూ లేకపోలేదు.