dateline:ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం, కమిటీ నుంచి అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం వరకు..
ఆంధ్రప్రదేశ్ పాలానా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మూడు రాజధానుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం తెలుపడానికి దాదాపు 7 నెలల సమయం పట్టింది. మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేయగా.. సీఎం హింట్ ఇచ్చారు. తర్వాత కమిటీల రిపోర్ట్, హై పవర్ కమిటీ నివేదిక తర్వాత అసెంబ్లీలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే మండలిలో చైర్మన్ షరీఫ్ అడ్డుకోవడంతో.. బిల్లుల ఆమోద ప్రక్రియ వాయిదాపడింది. ఈ బిల్లుల ప్రక్రియలో జరిగిన పరిణామాలను ఒకసారి గమనిద్దాం.
3 రాజధానులకే మొగ్గు.. ఇందుకే
ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణపై వైసీపీ సర్కార్ ఫోకస్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్ చేసి నష్టపోయామని.. ఇప్పుడు అమరావతిలో అభివృద్ది కేంద్రీకృతం కావొద్దని చెబుతూ వస్తోంది. దీనికి అనుగుణంగా తొలిసారి సీఎం జగన్ గతేడాది డిసెంబర్ 18వ తేదీన మూడు రాజధానులపై హింట్ ఇచ్చారు. రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పడంతో చర్చకు దారితీసింది. అప్పటినుంచి అమరావతి రైతులు ఆందోళన చేపడుతూనే ఉన్నారు. రెండురోజులకు అంటే డిసెంబర్ 20వ తేదీన జీఎన్ రావు కమిటీ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని నివేదిక అందజేసింది. కమిటీ నివేదిక సీఎంకు ఎలా తెలుసు అని.. ముందే ఎలా చెబుతారని విపక్షాలు గగ్గోలు పెట్టాయి.
జీఎన్ రావు, బీసీజే కమిటీ రిపోర్ట్
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును కూడా నివేదిక కోరడంతో.. జనవరి 4వ తేదీన బీసీజే ప్రతినిధులు నివేదిక సమర్పించారు. వారు కూడా సేమ్.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనని.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. దీంతో అమరావతి రైతులు, ప్రతిపక్ష టీడీపీ, సీపీఎం ఆందోళన చేపట్టాయి. దీంతో మూడురాజధానులపై ప్రభుత్వం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో హై పవర్ కమిటీ వేసింది. కమిటీ కూడా అభివృద్ది వికేంద్రీకరణకే మొగ్గుచూపడంతో.. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును రూపొందించింది. జనవరిలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా అసెంబ్లీ.. ఆమోదం తెలిపింది. కానీ మండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణాధికారంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో కాస్త బ్రేక్ పడింది.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
జూన్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. జూన్ 16వ తేదీన అసెంబ్లీ ఆమోదించగా.. మండలిలో మాత్రం చర్చ జరగలేదు. ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా చర్చ జరగకుండా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో జూలై 17వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ వద్దకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
విచక్షణాధికారంతో గవర్నర్ ఆమోదం..
రెండుసార్లు అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులు.. మండలి ఆమోదం పొందకుండా తనవద్దకు రావడంతో గవర్నర్ రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదుల సలహాలు తీసుకున్నారు. శ్రావణ శుక్రవారం జూలై 31వ తేదీన రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. జగన్ ప్రభుత్వం అభీష్టం నెరవేరింది.