టీలో ప్రచారం: పవన్ కళ్యాణ్తో దత్తాత్రేయ, ఎర్రబెల్లి భేటీ
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్తో తెలంగాణకు చెందిన బిజెపి నేత బండారు దత్తాత్రేయ, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రచారం చేయాలని వారు శనివారం పవన్ కళ్యాణ్ను కలిసి కోరారు. దత్తాత్రేయ తెలుగుదేశం పార్టీ మద్దతుతో సికింద్రాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేస్తుండగా, ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి సహకారంతో వరంగల్ జిల్లాలోని శాసనసభా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
ఎర్రబెల్లి, దత్తాత్రేయ విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీ తర్వాత తాను ప్రచారం చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. 24, 26 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో బిజెపి, టిడిపిలకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉంది.
అలాగే, ఈ నెల 27, 28 తేదీల్లో లోకసత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణకు మద్దతు పవన్ కళ్యాణ్ రోడ్ షోలు నిర్వహిస్తారని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా తెలుగువాళ్లు అధికంగా ఉన్న కర్ణాటకలోని ప్రాంతాల్లో పర్యటించారు.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిజెపి నేత నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి తాను సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తీరుపై ఆయన కాంగ్రెసుపై మండిపడుతున్నారు.