రైల్వే ఉద్యోగిని దారుణంగా హతమార్చిన తల్లీకూతుళ్ల అరెస్ట్
చిల్లకూరు మండలంలో ఓడూరులో పట్టపగలే రైల్వే ఉద్యోగిని షర్వాణి(28)ని గొంతుకోసి హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడిన తల్
నెల్లూరు: చిల్లకూరు మండలంలో ఓడూరులో పట్టపగలే రైల్వే ఉద్యోగిని షర్వాణి(28)ని గొంతుకోసి హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడిన తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సహకరించి ఉంటాడనే అనుమానంతో మృతురాలి భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో హత్యకు దారితీసిన వివరాలన్నీ నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
తన ప్రియుడిని పెళ్లాడిందనే అక్కసుతో అతడిని తిరిగి ఎలాగైనా తన దగ్గరుకు రప్పించుకోవాలనే కోరికతో అతడి భార్య అయిన షర్వాణిని హతమార్చేందుకు కుమార్తె మౌనిక పక్కా పథకం రచించగా తల్లి పద్మావతి ఆమెకు సహకరించింది. ఎలాగైనా షర్వాణిని హత్యచేయాలన్న పట్టుదలతో ఉన్న మౌనిక రైల్వే ఉద్యోగిని షర్వాణి రాకపోకలపై పూర్తి సమాచారం సేకరించి , షర్వాణి ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలోనే అక్కడకు వెళ్లి తల్లితో కలసి ఈ హత్య చేసినట్లు తెలిసింది. హతురాలిని గొంతు కోసే సమయంలో ఆమె బాగా పెనుగులాడటంతో ఆమె పొట్టపై కాళ్లపై కాళ్లతో తొక్కిపట్టినట్లు తెలిసి పోలీసులే వారి క్రూరత్వానికి విస్తుపోయినట్లు తెలిసింది.
షర్వాణిని హత్య చేసి వెలుపలికి వచ్చిన తల్లీకూతుళ్లకు షర్వాణి భర్త అశోక్ ఎదురవగా నీ భార్యను చంపేశామని, నీ కోసమే ఇదంతా చేశామని నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అశోక్ వెనుతిరిగి వెళ్లి తన సోదరుడు సంతోష్ ను ఏం జరిగిందో చూసి రావాలని పంపగా అతడు కిటికీలో నుంచి షర్వాణి రక్తపుమండుగులో పడి ఉండటం చూసి అన్నకు తెలుపగా అతడు పోలీసులకు సమాచారం అందించాడు.
ప్రియుడిని పెళ్లాడిందనే హత్య
ఓడూరుకు చెందిన షర్వాణి రైల్వేలో ఆమె గ్యాంగ్ ఉమెన్. ఆమెకు ఏడాదిన్నర క్రితం కాటూరుకు చెందిన అశోక్ తో వివాహమైంది. ఓడూరులో షర్వాణి తండ్రి రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ మృతిచెందడం వల్ల షర్వాణికి గ్యాంగ్ ఉమెన్గా ఉద్యోగం వచ్చింది. అశోక్ గూడూరులోని నెల్క్యాస్ట్ కర్మాగారంలో పని చేస్తున్నాడు. అయితే షర్వాణి ఉద్యోగం రీత్యా భార్యాభర్తలు ఓడూరులోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆశోక్కు పెళ్లికి ముందే వింజమూరు మండలం తమ్మిళ్లపాడు గ్రామానికి చెందిన మౌనిక అనే యువతితో సాన్నిహిత్యం ఉంది. ఆశోక్ మౌనికను పెళ్లి చేసుకోకుండా షర్వాణిని చేసుకోవడంతో ఖంగుతిన్న ఆమె అశోక్ ను వదలకుండా ఎలాగైనా భార్యాభర్తల నడుమ విభేదాలు సృష్టించి దగ్గర అశోక్ ను దక్కించుకోవాలని పలు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేకపోవడం, అశోక్ ను వదిలేయాలని షర్వాణికే వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో చివరకు ఆమెని చంపేయాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ముందుగా రైల్వేస్టేషన్లో షర్వాణిని కలసి మౌనిక మాట్లాడింది. ఆమెతో పాటు ఉన్నతల్లి కూడా వారి మాటల్లో జోక్యం చేసుకోవడం, వారిమధ్య వాదులాట జరగడం స్థానికులు గుర్తించారు. ఆ తరువాత షర్వాణి విరామ సమయంలో ఇంటికిరాగా ఆమెని అనుసరించి వచ్చిన మౌనిక ఆమె తల్లి ఇంట్లో కూడా షర్వాణితో వాదులాడి చివరకు ఆ ఇంట్లో ఉన్న కత్తితోనే ఆమెని దారుణంగా గొంతు కోసి చంపారని తెలుస్తోంది.
షర్వాణిని చంపిన అనంతరం మౌనిక ఆమె తల్లి పద్మావతి పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు పలు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. మృతురాలి మంగళసూత్రం, చేతిగాజులు తీసేసుకోవడంతో పాటు ఆమె ఒంటి మీద దుస్తులన్నీ చెదరగొట్టడంతో ఎవరో అత్యాచార యత్నం చేసి బంగారం దోచుకొని వెళ్లి ఉంటారనే కోణంలో కేసు విచారణ జరగాలని భావించారు.హత్య అనంతరం తాము వచ్చిన ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారని తెలుస్తోంది. షర్వాణి తల్లి తిరుపతిలో ఉండే కుమారుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉండటం వల్ల ఈ ఘోరం జరిగింది.
ఆ తరువాత కొంతసేపటికి అశోక్ సోదరుడు సంతోష్ వదిన ఇంటికి రాగా తలుపు తాళం వేసి ఉండటంతో తలుపు పక్కనే ఉన్న కిటికీలో నుంచి లోపలికి చూడగా వదిన షర్వాణి రక్తమడుగులో పడి ఉండటాన్ని గమనించి గట్టిగా కేకలు వేశాడు. దీనితో చుట్టుపక్కల వారు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
హంతకులు దొరికిందిలా..
షర్వాణిని హత్య చేసేందుకు మౌనిక, పద్మావతి శుక్రవారం ఉదయం ఓడూరు రైల్వేస్టేషన్ వద్దకు రావడం, అక్కడ ఆ తరువాత ఇంటి వద్ద షర్వాణితో వారు మాట్లాడటం రైల్వే ఉద్యోగులు, గ్రామస్థులు గమనించారు. వీరు స్థానికులు కాకపోవడంతో వీరి విషయమై తోటి సిబ్బందితో షర్వాణి చర్చించింది. అయితే వారెవరనే విషయం తోటివారికి చెప్పలేదు. షర్వాణి హత్య అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా గుర్తుతెలియని ఇద్దరు మహిళలు హత్యకు ముందు ఆమెతో మాట్లాడినట్లు పోలీసులకు తెలిసింది.
వారెవరై ఉంటారనే సమాచారం కోసం సంఘటనా స్థలానికి చేరుకున్న షర్వాణి భర్త అశోక్ను విచారించగా వారిలో ఒకరు తన ప్రియురాలు మౌనిక అని, రెండో మహిళ ప్రియురాలి తల్లి పద్మావతి అని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ మహిళలే హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫోన్ ట్రాకింగ్ ద్వారా నిందితులు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు. హత్యా సమయంలో చేతి కి గాయం కావడంతో నెల్లూరు నవాబుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌనిక ,ఆమె తల్లి పద్మావతిల ఆచూకిని సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే వివాహేతర సంబంధం కోసం అమాయకురాలైన షర్వాణిని దారుణంగా హతమార్చిన తల్లీకూతుళ్లని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ హత్య వెనక షర్వాణి భర్త అశోక్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్వాణి తల్లి ఊరు వెళ్లిందనే సమాచారం తెలిసే నిందితులు ఆమె ఇంటికి వచ్చి ఉంటారని, ఆ సమాచారం అశోక్ ఇచ్చి ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో తెలియజెప్పే ఘటన ఇది.