ఎపిలో దావూద్ గ్యాంగ్, ఢిల్లీకి తరలింపు: రాజీవ్ శుక్లాకు ఫోన్?
నెల్లూరు: అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులమని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు బిసిసిఐ సభ్యుడు రాజీవ్ శుక్లాకు ఫోన్చేసి నగదు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఈనెల 4వ తేదీన నెల్లూరుకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోన్చేసి వంద కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపుతామని బెదిరించినట్లు శుక్లా ఢిల్లీలోని స్పెషల్ ఎన్డిఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై 387, 120బి రెడ్విత్/34 సెక్షన్ల కింద ఎన్డిఆర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్డేటాను పరిశీలించగా అవి నెల్లూరు నగరం దాడివారి వీధికి చెందిన ఫత్తే అహ్మద్, అల్తాల వీధికి చెందిన సఫీ వుల్లాగా గుర్తించారు. 4న ఢిల్లీ పోలీసులు నెల్లూరు చేరుకున్నారు.
ఒకటో నగర ఇన్స్పెక్టర్ కె నరసింహారావుతో జరిగిన విషయం చర్చించి ఆయన సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో ఫత్తే అహ్మద్ తండ్రి నజీర్, సఫీవుల్లా తండ్రి కరీముల్లా తమ పిల్లలను ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వారు వివరించారు.
ఆ తర్వాత నెల్లూరు కోర్టులో నిందితులను హాజరుపరిచి తమ వెంట ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఈ ఘటనలో విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.