తుపాకీ, కత్తి హల్చల్: నంద్యాల వీరంగం ఇలా జరిగింది(పిక్చర్స్)
నంద్యాల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు, పోలీసులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.అయితే, గురువారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్న ఘటన సంచలనంగా మారింది.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు, పోలీసులు, ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో గురువారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్న ఘటన సంచలనంగా మారింది. పట్టణంలోని సలీంనగర్లో టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగిన సమయంలో టిడిపికి చెందిన అభిరుచి మధు ప్రైవేటు గన్మ్యాన్ గాలిలోకి కాల్పులు జరపడం, కత్తి పట్టుకుని తిరగడం కలకలం రేపింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఒకే చోటు ఇరువర్గాలు..
ఆ వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణానికి చెందిన కౌన్సిలర్ భర్త సలీంబాషా బుధవారం మరణించారు. ఆయన అంత్యక్రియలు గురువారం జరగడంతో పరామర్శించడానికి టిడిపికి చెందిన అభిరుచి మధు సలీంనగర్లోని అతని ఇంటికి వెళ్లాడు. కారు రోడ్డుపై ఉంచి ఇంట్లోకి వెళ్లి మాట్లాడుతున్న సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సైతం అదే ఇంటికి కౌన్సిలర్ను పరామర్శించడానికి వచ్చారు.
వివాదం రాజుకుందిలా..
రోడ్డుపై కారు ఉండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో శిల్పా అనుచరులు కారు తొలగించాలని అభిరుచి మధు అనుచరులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓ వ్యక్తి బండరాయి తీసుకుని మధు కారు వెనుక అద్దంపై వేయడంతో అది పగిలిపోయింది.
వేట కొడవలితో..
విషయం తెలుసుకున్న మధు ఆవేశంగా రోడ్డుపై కొబ్బరిబోండాలు విక్రయించే బండిలోని వేట కొడవలి తీసుకుని రారమ్మంటూ సవాల్ విసిరారు. తనను చంపడానికి శిల్పా వర్గీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆరోపిస్తూ తాడోపేడో తేల్చుకుందామంటూ కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో శిల్పా వర్గీయులు ముందుకు వెళ్లి మధుపై రాళ్లు విసిరారు. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన మధు గన్మ్యాన్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఘర్షణతో ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం
ఇరువర్గాల మధ్య తోపులాట కాస్తా ఘర్షణకు దారి తీయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. కాగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్న ఆనందంలో ఉన్న నంద్యాల పట్టణ ప్రజలకు కాల్పుల ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది.
శిల్పా చక్రపాణి వాదన..
కౌన్సిలర్ భర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే తన అనుచరులపై అభిరుచి మధు, అతని అనుచరులు దాడి చేశారని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి ఆరోపించారు. తన అనుచరులతో కలిసి వెళ్తుంటే రోడ్డుపై మరో కారు అడ్డంగా ఉందని, దీంతో తాను కారులోనే కూర్చున్నానని ఆయన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు తొలగించమంటూ తన గన్మ్యాన్ చెప్పడంతో మధు అనుచరులు ఘర్షణకు దిగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అశాంతిని రగిల్చేందుకే..
మధు చేతిలో వేట కొడవలి ఉందని ఇక్కడి నుంచి వెళ్లిపోదామని తన గన్మ్యాన్ చెప్పడంతో తాను వెనుదిరుగుతున్న సమంయలో కాల్పుల సంఘటన చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. పోలీసుస్టేషన్లో రౌడీషీట్ ఉన్న మధుకు గన్మ్యాన్ను ప్రభుత్వం ఎందుకు అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. నంద్యాలలో అశాంతిని రగల్చడానికే టిడిపి ఇలాంటి పనులు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
మధును హతమార్చాలనే శిల్పా ప్రయత్నం..
నంద్యాలలో బుధవారం పోలింగ్ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల దొంగ ఓట్లను అడ్డుకున్నారన్న కక్ష్యతో అభిరుచి మధుపై శిల్పా వర్గీయులు హత్యాయత్నం చేశారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు.
దొంగ ఓట్లు అడ్డుకున్నందుకే..
పోలింగ్ సరళిని పరిశీలించడానికి మధు వెళ్లిన సమయంలో భారీ సంఖ్యలో యువకులు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయం తెలిసి శిల్పా చక్రపాణి అక్కడికి చేరుకుని మధుతో వాగ్వివాదానికి దిగారని ఆమె వివరించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఫరూక్ అక్కడికి చేరుకుని దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన యువకులను పోలీసులకు అప్పగించి మధును వెనక్కి తీసుకువచ్చారని తెలిపారు.
చంపేవారేమో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఎత్తుగడలను పారనీయకపోవడం వల్లే మధును హతమార్చాలని నిర్ణయించుకున్నారని ఆమె మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి శిల్పా చక్రపాణిరెడ్డి 10 వాహనాల్లో వెళ్తారా? అని ఆమె ప్రశ్నించారు. మధుకు గన్మ్యాన్ లేకపోతే హత్య చేసే వారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు దాడులు చేసుకుంటున్నారు.