సంచయిత ఎంట్రీతో బద్దలైన పుట్ట.. ఈవో రిపోర్టుపై జగన్ సర్కారు కొరడా..
మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్టు బోర్డు చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజు బాధ్యతలు చేపట్టి వారం రోజులైనా తిరక్కముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా ట్రస్టుకు భారీ ఎత్తున నష్టం చేకూర్చుతోన్న అవినీతిపుట్ట బద్ధలైంది. గత పాలకవర్గం హయాంలో మాన్సాస్ ట్రస్టులో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) భ్రమరాంబ సంచలన రిపోర్టు తయారుచేశారు. సంచియిత ఇచ్చిన భరోసాతోనే ఈవో తన రిపోర్టును సీఎం జగన్ కు పంపారని, బాధ్యులపై కొరడా ఝుళిపించేందుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోందని విశ్వసనీయంగా తెలిసింది.
అసలేం జరిగిందంటే..
అశోక్ గజపతిరాజు హయాంలో మాన్సాస్ ట్రస్టులో భారీ అవినీతి జరిగిందని, అందుకే ఆయనను చైర్మన్ పదవి నుంచి తప్పించామని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. అయితే ఆ అక్రమాలకు దీనికి సంబంధించిన ఆధారాలేవీ ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. తాజాగా మాన్సాస్ ట్రస్టు భ్రమరాంబ.. ప్రభుత్వానికి పంపిన రిపోర్టులో అక్రమవ్యవహారాలకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నట్లు వెల్లడైంది. ట్రస్ట్ పరిధిలో వందలాది ఆలయాలు, పదుల కొద్దీ విద్యా, సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. ఆయా ఆలయాల పరిధిలోని భూముల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఈవో పూసగుచ్చినట్లు రిపోర్టు రాశారు.
ఆ ఒక్కచోటే కోట్లు మింగేస్తున్నారు..
తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి, వీరపల్లిపాలెంలో ట్రస్టుకు చెందిన 365 ఎకరాల భూములున్నాయి. ఆ భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఈవో భ్రమరాంబ రిపోర్టులో రాశారు. కేవలం 100 ఎకరాలకే అనుమతి తీసుకుని.. మొత్తం 365 ఎకరాల్లో అక్రమంగా ఇసుకను తొవ్వేస్తున్నారని, మూడేళ్లుగా సాగుతోన్న ఈ దందా కారణంగా ట్రస్టుకు కోట్ల రూపాయల్లో నష్టం జరుగుతోందని, దీనిపై కలెక్టర్, గనుల శాఖ అధికారుల ఆదేశాలు కూడా బుట్టదాఖలయ్యాయని ఆమె వివరించారు.
మాజీ ఈవో వెనుక పెద్దల హస్తం?
కాగా, మాన్సాస్ ట్రస్టు ప్రస్తుత ఈవో భ్రమరాంబ రిపోర్టు ప్రకారం.. అక్రమ ఇసుక దందాలో మాజీ ఈవో రామచంద్ర మోహన్ పేరు ప్రముఖంగా వినబడుతోంది. ట్రస్టును, ఇరిగేషన్, గనుల శాఖలను కూడా ఆయన చాకచక్యంగా బోల్తా కొట్టించారని, సదరు మాజీ ఈవో వెనుక టీడీపీ బడా నేతలు ఉన్నారని రిపోర్టులో పేర్కొన్నారని, ఆమేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించి, దోషుల్ని బజారుకీడ్చాలని ప్రభుత్వం చోచిస్తోంది. దీనిపై ఒకటిరెండురోజుల్లోనే కీలక ఆదేశాలు వెలువడే అవకాశాలున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.
Recommended Video
దుస్తులపై రగడ..
సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు బోర్డు చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజు బాధ్యతలు చేపట్టడంపై ఆమె బాబాయి, ట్రస్టు మాజీ చైర్మన్ అశోక గజపతిరాజు తీవ్రవిమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సంచయిత నిఖార్సైన హిందువు కాదని, క్రిస్టియానిటీని పాటిస్తూ పాశ్చాత్య దుస్తులు ధరిస్తారనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన సంచయిత.. తనపై ఆరోపణలకు ఘాటుగా బదులిచ్చారు. సొంత కుటుంబీకులే విమర్శలు చేస్తుండటం బాధాకరమని, చర్చిలు, మసీదులకు వెళ్లినంత మాత్రాన మతం మారినట్లు కాదని, ఆ మాటకొస్తే అశోకగజపతిరాజు కూడా చాలా సార్లు వెళ్లారని, ఆధునిక మహిళగా ఎలా మాట్లాడాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తనకు ఎవరూ చెప్పనక్కర్లేదని సంచయిత ఫైరయ్యారు.