ఏపీ-తెలంగాణ బస్సులు తిరిగేదెన్నడో ? సేవ తర్వాత లాభాలే ముందంటున్న ఆర్టీసీలు...
దేశవ్యాప్తంగా కరోనా అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్ర రవాణాపై ఆంక్షలు పెట్టొద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని తెలిపింది. తెలంగాణలో రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు.
కరోనా లాక్డౌన్తో బంద్ అయిన బస్సు సర్వీసులపై ఆంక్షలు ఎత్తేసినా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడుందనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువ సర్వీసులు తమవే ఉండాలన్న పట్టుదల వల్ల ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
ఆంక్షలు ఎత్తేసినా మొదలు రాని రాకపోకలు...
దేశవ్యాప్తంగా కరోనా అన్లాక్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. వివిధ రాష్ట్రాల మధ్య అన్ని విధాలా రాకపోకలు సాగుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మాత్రం కదలడం లేదు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను సైతం చెక్ పోస్టుల ద్వారా అడ్డుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా కేంద్రం ఆగ్రహంతో వాటిని ఎత్తేసింది. కానీ బస్సు సర్వీసులు మాత్రం ప్రారంభించేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలితం ఇవ్వలేదు. దీంతో తదుపరి చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారిస్తోంది.
చిక్కుముడి ఇక్కడే...
లాక్ డౌన్ కారణంగా మార్చి 22న నిలిచిపోయిన అంతర్ రాష్ట్ర రవాణా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏపీ బస్సులను సైతం తెలంగాణకు రానివ్వడం లేదు. అయితే బస్సుల రాకపోకలు పునఃప్రారంభం కాకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలోరెండు రాష్ట్రాల మధ్య ఎవరు ఎన్ని బస్సులు నడపాలి, ఎన్ని కిలోమీటర్లు నడపాలి అన్న దానిపై ఒప్పందం కుదరకపోవడమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే బస్సులు నడుస్తున్నాయో లాక్ డౌన్ ముందు వరకు అలానే నడిచాయి. అయితే, ఈ విషయంలో తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ బస్సులు ఏపీకి తక్కువగా సంఖ్యలో ఉన్నాయని, అదే ఏపీ నుంచి తెలంగాణకి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని అభ్యతరం తెలిపింది. తెలంగాణ బస్సు సర్వీసులు పెంచుకునేందుకు ఒప్పుకోవాలని ఏపీని కోరుతుంది. దీనికి ఏపీ ఒప్పకోకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
టీఎస్ఆర్టీసీ అత్యాశ...
వాస్తవానికి కరోనాకు ముందు ఇరు రాష్టాల మధ్య ఎన్ని బస్సులు నడిచాలో ఇప్పుడూ అంతే సంఖ్యలో వాటిని నడపాలని ఏపీ కోరుతుండగా.. టీఎస్ఆర్టీసీ అందుకు అంగీకరించడం లేదు. కరోనా కారణంగా ఇరు రాష్ట్రాలూ నష్టపోయాయని, ఆ నష్టాలను పూడ్చుకోవాలంటే తమకు అత్యదికంగా ఆదాయం తెచ్చిపెట్టే హైదరాబాద్ నుంచి ఏపీ సర్వీసులను పెంచుకుంటామని తెలంగాణ ప్రతిపాదిస్తోంది. దీనికి అంగీకరిస్తే ఇప్పటివరకూ రెండు వైపులా అత్యధికంగా బస్సులు తిప్పుతున్న ఏపీఎస్ఆర్టీసీకి ఆ మేరకు నష్టాలు తప్పవు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ దీనికి ససేమిరా అంటోంది. ఈ విషయంలో టీఎస్ఆర్టీసీ కూడా అదే పట్టు కొనసాగిస్తుండంతో మరికొన్ని రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగే అవకాశముంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోరిన కిలోమీటర్ల దూరంలో సగం తగ్గించుకుంటామని ఏపీ అధికారులు తెలిపారు. అయితే, ఏపీ ఈ ప్రతిపాదన తెచ్చినా ఇంతవరకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పందిచంలేదు. ఏపీ ఈ విషయంలో లేఖ రాసినా టీఎస్ఆర్టీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
Recommended Video
ప్రయాణికుల ఆగ్రహం- సేవ కంటే లాభాలే ముఖ్యమా ?
కేంద్రం అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతించినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆదాయం లెక్కలతో బస్సులు నడపకపోవడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సేవ కోసం పనిచేస్తున్న ఆర్టీసీలు కరోనా సమయంలో ఆదాయం పేరుతో జనాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటనే ప్రశ్న వారి నుంచి తలెత్తుతోంది. దీనికి అధికారులు, ప్రభుత్వాల వద్ద సమాధానం లేదు. ప్రయాణికుల నుంచి ఒత్తిడి పెరిగితే అప్పుడు చూడొచ్చులే అన్న భావనతోనే చర్చల ప్రక్రియను వీరు సాగదీస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే తెగేదాకా లాగితే ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగి ఇరువురికీ నష్టదాయకంగా మారే ప్రమాదం లేకపోలేదు.