ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య: హత్యలోని కోణాలివే!..
కేఈ కుటుంబం వల్లే నారాయణరెడ్డి హత్యకు గురయ్యారని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. వెల్దుర్తి ఎస్ఐ, ఎస్పీల వైఫల్యమే ఇందుకు కారణమన్నారు.
కర్నూలు: రాయలసీమ ఫ్యాక్షన్ కక్షలు పత్తికొండ వైసీపీ ఇన్ చార్జీ నారాయణరెడ్డి బలితీసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. సినీ ఫక్కీలో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఆయన హత్య ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది. హత్య కేసులో పోలీసుల పాత్రపై వైసీపీ నేతలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.
'ఎస్కేప్' ఛాన్స్ లేకుండా: విస్తుపోయే ప్లాన్! నారాయణరెడ్డి హత్య జరిగిందిలా..(ఫోటోలు)
అలాగే పరోక్షంగా ప్రభుత్వం తరుపు నుంచి కూడా ఈ హత్యకు మద్దతు లభించిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నారాయణరెడ్డి హత్య ఉదంతంతో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం నంద్యాలలోని ఒక పెళ్లికి వేడుకకు హాజరై, అక్కడి నుంచి పలు గ్రామాల్లోని కార్యక్రమాల్లో పాల్గొని ఆయన వెనుదిరిగారు. అలా మార్గమధ్యలోనే ఆయన హత్యకు గురయ్యారు.
కర్నూల్ బంద్: కేఈ తనయుడిపై కేసు, నారాయణరెడ్డి హత్యతో హైటెన్షన్
రామకృష్ణాపురం వివాహ వేడుకకు వెళ్తుండగా..
నంద్యాలలో వివాహకు వేడుకకు హాజరైన నారాయణరెడ్డి.. అటు తర్వాత రామకృష్ణాపురంలో జరిగే ఓ వివాహ వేడుకకు బయలుదేరారు. కృష్ణగిరి మండలంలో జరుగుతున్న ఈ పెళ్లికి చెరుకులపాడు మీదుగా వెళ్తున్న తరుణంలో ప్రత్యర్థుల ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.
కల్వర్టు పక్కన పొలాల్లోను, కల్వర్టు పైపుల్లోను, ట్రాక్టర్లలోను మాటు వేసి ఉన్న ప్రత్యర్థులంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ట్రాక్టర్ తోనే నారాయణరెడ్డి ఫార్చునర్ కారును వెంబడించారు. క్రిష్ణగిరికి అర కి.మీ దూరంలో మరో ట్రాక్టర్ తో నారాయణరెడ్డిని కారును ఢీకొట్టడంతో.. ఒక గుంతలో కారు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.
వేటకొడవళ్లు, మారణాయుధాలతో:
నారాయణరెడ్డి తమ ఉచ్చులో చిక్కుకోగానే ప్రత్యర్థులు పంజా విప్పారు. వేటకొడవళ్లు, ఇతర మారణాయుధాలతో ఆయనపై దాడికి తెగబడ్డారు. తొలుత నారాయణరెడ్డిని హత్య చేసి, ఆపై ఆయన అనుచరుడు సాంబశివుడి వెంట పడ్డారు. పొలాల్లో తరిమి తరిమి అతన్ని హత్య చేశారు. హత్యానంతరం నారాయణరెడ్డి మృతదేహాన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
నారాయణరెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని తెలియగానే భారీ ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. అభిమానులు, మద్దతుదారులు తమను లోపలికి వెళ్లనివ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. తొలుత పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
15సార్లు కసిగా నరికి.. భీతావహ దృశ్యం:
నారాయణరెడ్డి నారాయణరెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత పోలీసులే విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహంపై 15కు పైగా కత్తిపోట్లను గుర్తించారు. ముఖ్యంగా తలపై అత్యంత దారుణంగా 8సార్లు వేటకొడవళ్లతో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం. చేతి చూపుడు వేలు, మధ్య వేలు తెగిపోయి కనిపించాయి.
సంఘటనా స్థలంలో నారాయణరెడ్డి పుర్రె పగిలిపోయి, మెదడు చిట్లిపోయి అత్యంత భీతావహ దృశ్యాన్ని తలపించింది. ఘటనాస్థలి నుంచి లుంగీతో పాటు మరికొన్ని అనుమానస్పద వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బందోబస్తు ఏదో ముందే కల్పిస్తే:
అభిమానులన, మద్దతుదారులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ బందోబస్తు ఏదో ముందే కల్పించి ఉంటే నారాయణరెడ్డి హత్యకు గురయ్యేవారు కాదు కదా? అని వారు నిలదీశారు. దీంతో మెత్తబడ్డ పోలీసులు ఒక్కొక్కరిని లోపలికి వెళ్లనిచ్చే అవకాశం ఇచ్చారు.
సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కూడా అభిమానుల తాకిడి తగ్గలేదు. సాయంత్రం సమయంలో నారాయణరెడ్డి అక్కాచెల్లెళ్లు, పలువురు మహిళలు ఆసుపత్రి వద్దకు రాగా.. పోలీసులు లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
బీహార్ బ్యాచ్ దిగిందా?:
హత్యలో బీహార్ ముఠాను రంగంలోకి దించినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్లు ఎవరివనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్ కొన్ని వివరాలు సేకరించాయి. ప్రస్తుతం ఆ వివరాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపణలు:
నారాయణరెడ్డి హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చాలాసార్లు రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని కోరినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. మరో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం పోలీసులు తీరుపై మండిపడ్డారు. ఎస్పీ రవికృష్ణ సోషల్ వర్కరే కానీ పోలీసు శాఖకు పనికిరాని వ్యక్తి అన్నారు. పోలీసులంతా ఖాకీలకు బదులు పచ్చ చొక్కాలు వేసుకుంటే బాగుంటుందన్నారు.
నిందితులను పట్టుకుంటామని ఓవైపు ఎస్పీ చెబుతున్నారని, మరోవైపు హత్య చేసినవాళ్లు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేఈ కుటుంబం వల్లే:
కేఈ కుటుంబం వల్లే నారాయణరెడ్డి హత్యకు గురయ్యారని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. వెల్దుర్తి ఎస్ఐ, ఎస్పీల వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. వైసీపీ శ్రేణులంతా హత్యను తీవ్రంగా ఖండించాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, అనంతవెంకటరామిరెడ్డిలు సైతం వైసీపీ జిల్లా ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టారునందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, అనంతవెంకటరామిరెడ్డి నారాయణరెడ్డి మృతదేహాన్ని సందర్శించారు.
పోస్టుమార్టం నేడే:
హత్యానంతరం ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు మార్చురీ గదికి నారాయణరెడ్డి మృతదేహాన్ని తరలించారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో.. సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పోస్టుమార్టంను సోమవారం నిర్వహించనున్నారు.