మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష, తేదీని ఖరారు చేయనున్న హైకోర్టు..
ఏపీలో సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో తీర్పును చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నది. బాలికపై లైంగికదాడి చేసి హత్య చేశాడని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. కేసు నమోదు చేసిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయగా.. వంద రోజుల్లోనే దోషికి కోర్టు శిక్ష విధించింది.
ఉరి శిక్ష..
ఏపీలో పోక్సో కోర్టు విధించిన తొలి ఉరి శిక్ష రఫీదే అయ్యింది. ఉరి శిక్ష తేదీని హైకోర్టు వెల్లడిస్తోంది. కేసు విచారణలో భాగంగా 41 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఆరేళ్ల చిన్నారి కేసును పోలీసులు ప్రత్యేకంగా తీసుకున్నారు. కేవలం 17 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేయగా.. 100 రోజుల్లో విచారణ పూర్తయ్యింది. ఎఫ్ఎస్ఎల్ కూడా 10 రోజుల్లో నివేదిక అందజేసిందని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..
బి కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాలెనికి చెందిన సిద్దారెడ్డి, ఉసారాణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వైష్ణవి, వర్షిణి, వర్షిత అనే కూతుళ్లతో గతేడాది నవంబర్ 7వ తేదీన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో ఓ వివాహానికి హాజరయ్యారు. కేఎన్ఆర్ కల్యాణ మండపానికి పేరెంట్స్తో కలిసి ఆరేళ్ల చిన్నారి వర్షిత పెళ్లికి వచ్చింది. రాత్రి 10 గంటల వరకు ఆడుకొన్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆమె కోసం కల్యాణ మండపం మొత్తం వెతికినా ఫలితం లేకుండా పోయింది. పేరెంట్స్ పోలీసులకు సమాచారం అందించారు.
కిడ్నాప్ చేసి..
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో లారీ క్లీనర్ రఫీ చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు కనిపించింది. నిందితుడి కోసం పోలీసు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరునాడు ఫంక్షన్ హాల్ సమీపంలో గల నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి విగతజీవిగా కనిపించింది. చిన్నారిని కిడ్నాప్ చేసి.. లైంగికదాడి చేయడమే గాక హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ఛత్తీస్గఢ్లో తేలిన నిందితుడు..
చిన్నారిపై లైంగికదాడి చేసింది రఫీ అని పోలీసులు తేల్చారు. చిన్నారి హత్యపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాల నుంచి నిరసనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు..రఫీ కోసం ముమ్మరంగా గాలించారు. చిన్నారి హత్య తర్వాత గ్రామంలో లేకపోవడంతో అనుమానం మరింత బలపడింది. మొబైల్ స్విచాప్ చేయడంతో హత్య చేసింది రఫీ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరు బృందాలతో రఫీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసి.. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
17 రోజుల్లో చార్జీషీట్..
నవంబర్ 16వ తేదీన రఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో, హత్య కేసులు నమోదు చేసి.. 17 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేశారు. చిన్నారిని హత్య చేసింది రఫీ అని బలమైన ఆధారాలు చార్జీషీట్లో పొందుపరిచారు. అప్పటినుంచి పోక్సో కోర్టులో విచారణ జరిగింది. వంద రోజుల్లో 41 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వాంగ్మూలం తీసుకున్నారు. చిన్నారిపై లైంగికదాడి చేసి, హతమార్చాడని ఆధారాలతో సహా నిరూపించారు.
వదిలి వెళ్లిపోయిన భార్య
మదనపల్లె మండలం బసినికొండ లారీ క్లీనర్ మహ్మద్ రఫీ స్వస్థలం. రఫీ ప్రవర్తన సరిగా లేదని అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచి రఫీ జులాయిగా తిరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా చిన్నారులపై రఫీ రెండుసార్లు లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఓ కేసులో జైలుకెళ్లి రెండు నెలలు కూడా ఉన్నాడు. తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
Recommended Video
ఇదీ రఫీ నేర చరిత్ర
నిందితుడు మహ్మద్ రఫీది ఇదివరకు కూడా నేరచరిత్ర ఉంది. 8వ క్లాసులో లైంగికదాడి చేశాడు. తర్వాత మైనర్ బాలికను హతమార్చి.. రెండునెలలు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. కానీ అప్పటికీ కూడా బుద్ది మారలేదు. గతేడాది చిన్నారిని ఫోటో తీస్తానని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బాత్రూంలో లైంగికదాడి చేసి.. హతమార్చారు. తర్వాత గుండకొట్టించుకొని ఛత్తీస్గఢ్ పారిపోయాడు. ఫోన్ వాడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు మాత్రం వలపన్ని పట్టుకొన్నారు. ఇదివరకే తీర్పు వెలువరించాల్సి ఉన్న నిందితుడు చివరి వాదనలను కూడా మేజిస్ట్రేట్ ఆలకించారు. తనకు భార్య, కుటుంబం ఉందన వదిలేయాలని వేడుకున్నాడు. కానీ మేజిస్ట్రేట్ అత్యంత దారుణంగా చిన్నారిని హతమార్చాడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.